ప్రకృతి విపత్తులు తప్పించి.. చరిత్రలో భారీ విషాదాంతాలుగా మిగిలిన ఘటనలు తక్కువ. అమెరికా గడ్డపై జరిగిన 9/11 ట్విన్ టవర్స్ దాడిలో మూడు వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పటిదాకా ఈ విషాదం కంటే ముందు ప్లేస్లో ఉండేది ‘జోన్స్టౌన్ నరమేధం’. 1978, నవంబర్ 18న.. దాదాపు తొమ్మిది వందల మంది సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనే ఇది. ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మడం.. ఆరాధించడం ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఈ ఇన్సిడెంట్.. విషాదంతో పాటు బోలెడన్ని అనుమానాల్ని మిగిల్చింది.
వెనిజులా-–సురీనామ్ మధ్య ఉన్న తీరదేశం గుయానా. ఇది సౌత్ అమెరికా రీజియన్లో ఉన్నప్పటికీ.. ఈ నేలలో కరేబియన్ కల్చర్ లోతుగా పాతుకుపోయింది. గుయానా రాజధాని జార్జ్టౌన్ని ఆనుకుని వేల ఎకరాల్లో దట్టమైన అడవులు ఉంటాయి. ఈ అడవుల్లోనే ఉంది జోన్స్టౌన్. ఇక్కడి నుంచే ఒకప్పుడు ‘పీపుల్స్ టెంపుల్’ యాక్టివిటీస్ని నడిపించేవాడు జిమ్ జోన్స్. అయితే జోన్స్ని ఒక వ్యక్తి అనడం కంటే.. జనాల్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఒక శక్తి అని చెప్పడం కరెక్ట్. విచిత్రమైన ఐడియాలజీతో వేలమంది అనుచరుల్ని తయారుచేసుకుని.. అగ్రరాజ్యాల అధినేతల్ని అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా కలుసుకునేంత క్రేజ్ సంపాదించుకున్నాడు జోన్స్.
మిక్స్డ్ ఐడియాలజీ
జిమ్జోన్స్.. చరిష్మా ఉన్న ఒక చర్చ్మ్యాన్. క్రిస్టియానిటి, కమ్యూనిజం, సోషలిస్ట్.. ఐడియాలజీల్ని మిక్స్ చేసి కొత్తతరహా స్పీచ్లు ఇస్తుండేవాడు. అదేటైంలో రేసిజానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసేవాడు. అవి ఆఫ్రో–అమెరికన్లలో ఎక్కువ జోష్ నింపేవి. ఇలా తనకంటూ ఫాలోయింగ్ పెరిగాక.. మత ఉద్యమాన్ని మొదలుపెట్టాడు జోన్స్. ఇందులో భాగంగానే ఇండియానాపొలిస్లో ‘పీపుల్స్ టెంపుల్’ను 1950లో నెలకొల్పాడు. ఈ సిద్ధాంతాలు కొత్తగా ఉండడంతో తక్కువ టైంలో ఎక్కువమంది ఎట్రాక్ట్ అయ్యారు. అయితే 1970 నుంచి ‘పీపుల్స్ టెంపుల్ అక్రమాల’ పేరిట మీడియాలో వరుసగా కథనాలు వచ్చాయి. దీంతో మెయిన్ బ్రాంచ్ని ఊరూరా మారుస్తూ.. చివరికి శాన్ఫ్రాన్సిస్కోలో సెటిల్ అయ్యాడు జోన్స్. అయితే అక్కడా విమర్శలు జోన్స్ని వదల్లేదు. దీంతో పీపుల్స్ టెంపుల్ మకాంని గుయానా అడవుల్లోకి షిఫ్ట్ చేశాడు.
సోషలిస్ట్ ప్యారడైజ్
1974లో గుయానా అడవుల్లో 3,800 ఎకరాల భూమిని ‘పీపుల్స్ టెంపుల్’కి ఉత్తపుణ్యానికే కట్టబెట్టింది అమెరికా ప్రభుత్వం. ఆ ఏరియాకి జోన్స్ పేరు మీద ‘జోన్స్టౌన్’ అని పేరు పెట్టారు. 1976లో జోన్స్టౌన్కి భార్యతో సహా షిఫ్ట్ అయ్యాడు జిమ్జోన్స్ . ఆ టైంలోనే అతనిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో తనను అభిమానించే వాళ్లను జోన్స్టౌన్కి వచ్చేయాలని పిలుపు ఇచ్చాడతను. ‘ఇకనుంచి మనం మన రాజ్యంలోనే బతుకుదాం. గౌరవంగా ఉందాం. జోన్స్టౌన్ ఒక సోషలిస్ట్ ప్యారడైజ్. పీపుల్స్ టెంపుల్ ఆరాధకులకు స్వాగతం పలుకుతోంది’ అని ఓపెన్ ఇన్విటేషన్ రిలీజ్ చేశాడు జోన్స్. గుడ్డిగా అతన్ని నమ్మిన పీపుల్స్ టెంపుల్ మెంబర్స్ అంతా జోన్స్టౌన్కి ‘క్యూ’ కట్టారు. అయితే కొన్నాళ్లు గడిచాక.. అది స్వర్గం కాదు నరకం అని వాళ్లు తెలుసుకున్నారు.
ప్రాణభయంతో..
జోన్స్టౌన్లో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరి పాస్పోర్టుని లాక్కున్నాడు జిమ్జోన్స్. ఆ ఊరి కోసం ప్రత్యేకంగా కొన్నిచట్టాల్ని తయారుచేశాడు. ఎవరైనా వాటిని అతిక్రమిస్తే కఠినంగా శిక్షించేవాడు. జోన్స్టౌన్ చుట్టూరా గన్స్తో గార్డులు 24/7 కాపలా కాసేవాళ్లు. ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే కాల్చి చంపేవాళ్లు. ఒకానొక టైంలో సభ్యులపై జోన్స్ లైంగికవేధింపులకు పాల్పడట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అక్కడ జరుగుతున్న విషయాలేవి బయటి ప్రపంచానికి లీక్కాకుండా జాగ్రత్తపడేవాడు జోన్స్. అయితే అర్థరాత్రుళ్ల వరకు మీటింగ్, ప్రేయర్స్ వల్ల జోన్స్ మానసిక స్థితి దెబ్బతింది. దీంతో డ్రగ్స్కి బానిసయ్యాడు. ఒకానొకటైంలో జోన్స్టౌన్ రహస్యాలు, పీపుల్స్ టెంపుల్ మాటున జరిగే చీకటి పనులు అమెరికాకి తెలిస్తే తన ఖేల్ ఖతమని భయపడ్డాడు. ఆ భయంతో చావుకి సిద్ధపడాలంటూ అనుచరులను సిద్ధం చేశాడు.
వైట్హౌజ్ పంచాయితీ
పోనుపోను పీపుల్స్ టెంపుల్ వ్యవహారంపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. 1978లో జోన్స్టౌన్లో చిక్కుకున్నవాళ్ల ఫ్యామిలీ మెంబర్స్, కొందరు టెంపుల్ మాజీ సభ్యులతో కలిసి విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు. యూఎస్ కాంగ్రెస్ మెంబర్గా ఉన్న లియో ర్యాన్ని కలిసి.. తమవాళ్లని కాపాడాలని రిక్వెస్ట్ చేశారు. అదే టైంలో జోన్స్ మద్దతుదారులు కొందరు ప్రెసిడెంట్ జిమ్ కార్టర్కి ‘జోన్స్ ఉన్నతమైన వ్యక్తి’ అని పేర్కొంటూ ఒక లెటర్ రాశారు. దీంతో వ్యవహారం అంతా చల్లారినట్లేనని అంతా అనుకున్నారు. కానీ, జూన్ నెలలో పీపుల్స్ టెంపుల్ నుంచి లెటన్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్తో జోన్స్టౌన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. జోన్స్టౌన్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనని యూఎస్ కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. వైట్హౌజ్లో 16గంటల మీటింగ్ తర్వాత ర్యాన్ని హెడ్గా నియమిస్తూ ఒక నిజనిర్ధారణ బృందాన్ని జోన్స్టౌన్కి పంపించారు. నవంబర్ 17న.. ర్యాన్ కొందరు జర్నలిస్టులతో కలిసి జోన్స్టౌన్కి చేరుకున్నాడు. వాళ్లను గ్రాండ్గా రిసీవ్ చేసుకున్న జోన్స్.. మర్యాదలు చేశాడు. ఆ టైంలో.. జోన్స్టౌన్ ప్రజలు కొందరు ర్యాన్ని సీక్రెట్గా కలవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన జోన్స్ లెఫ్టినెంట్ ఒకడు ర్యాన్పై కత్తి విసిరాడు. కానీ, ఆయన ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు. రిపోర్ట్తో వైట్హౌజ్కి తిరుగు ప్రయాణం అయిన ర్యాన్ బృందంపై ఎయిర్స్ట్రిప్(రన్వే) దగ్గర దాడి చేయించాడు జోన్స్. ఈ దాడిలో ర్యాన్తో పాటు మరో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు.
పిల్లలతో మొదలై..
ర్యాన్ చావుతో జోన్స్లో భయం మొదలైంది. ఏ టైంలో అయినా అమెరికా దళాలు జోన్స్టౌన్పై విరుచుకుపడడం ఖాయం అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా తన పిల్లల్ని జోన్స్టౌన్ దాటించాడు. భార్య మార్సలిన్ మాత్రం అతనితోనే ఉంది. ఆ మరుసటి రోజే అనుచరులందరినీ పీపుల్స్ టెంపుల్ దగ్గరకి రావాలని కబురు పెట్టాడు. మొత్తం 900 మంది వచ్చారు. వాళ్లకు ఆత్మహత్యకి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చాడు జోన్స్. భయంతో జనాలు కేకలు పెట్టారు.. ఏడ్చారు. ‘పిరికిపందల్లా భయంతో వణికిపోయే కన్నా.. చావుని గొప్పగా భావించండి’ అంటూ వాళ్లలో విషం నింపే ప్రయత్నం చేశాడు. అక్కడున్నవాళ్లలో 300 మంది పిల్లలే. ముందు వాళ్లకు సైనైడ్ కలిపిన జ్యూస్ తాగించాలని చెప్పాడు. ఆ తర్వాత సైనైడ్ సిరంజీలతో ప్రాణాలు తీసుకోవాలని పెద్దవాళ్లను ఆదేశించాడు. చుట్టూ గార్డ్స్ ఉండడంతో పారిపోవాలని ప్రయత్నించినా ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే ఆత్మహత్యకే సిద్ధపడ్డారంతా. 40 నిమిషాల్లోనే ఘోరం జరిగిపోయింది. ఈ మాస్ సూసైడ్(మర్డర్)ని ఒక ‘రెవల్యూషనరీ యాక్ట్’గా నినాదాలు చేస్తూ గన్తో భార్యని, తర్వాత తనని తాను కాల్చుకుని ప్రాణం విడిచాడు జిమ్ జోన్స్.
శవాల గుట్టలు
జోన్స్ ఊహించినట్లే నవంబర్ 19న ఉదయం అమెరికా సైన్యం జోన్స్టౌన్లో ల్యాండ్ అయ్యింది. కానీ, ఎటు చూసినా గుట్టలుగా శవాలే కనిపించాయి. మొత్తం 909మంది ఈ మాస్ సూసైడ్లో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవాళ్లంతా అమెరికా సిటిజన్షిప్ ఉన్నవాళ్లే. మరోవైపు రంగంలోకి దిగిన ఎఫ్బీఏ ఈ మాస్ సూసైడ్కి సంబంధించి 40 నిమిషాల ఆడియో ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. శవాల్ని భద్రపరచడానికి గుయానిస్ ఆర్మీ సాయం తీసుకుంది అమెరికా. మొత్తం బాడీలను డిస్ఇన్ఫెక్ట్ మెటల్బాడీ బాక్సుల్లో జాగ్రత్త చేశారు. జిమ్జోన్స్ బాడీని నెలపాటు ఎంబామింగ్ చేసి దాచిపెట్టారు. ఆ తర్వాత పోస్ట్మార్టం చేసి.. సూసైడ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాకే అంత్యక్రియలు నిర్వహించారు. ఏప్రిల్ 1979 నాటికి మొత్తం శవాల్లో 300 బాడీల్ని మాత్రమే.. వాళ్లవాళ్లు గుర్తించారు. ఆరోజుల్లో మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఫీజు 500 డాలర్లు ఉండేది. అది చెల్లించలేక చాలామంది జోన్స్టౌన్కి వెళ్లలేపోయారు. మరో 200 బాడీలు డీకంపోజ్ అయ్యాయి. దీంతో బాడీల్ని యుద్ధవిమానాల్లో తరలించి కొన్నింటిని ఒక్లాండ్లోని శ్మశానంలో.. మరికొన్నింటిని శాన్ఫ్రాన్సిస్కో తీరం వెంబడి ఖననం చేశారు.
అయితే జోన్స్టౌన్ నరమేధంలో ఎఫ్బీఐ సమర్పించిన రిపోర్టుపై చాలామందికి అనుమానాలు కలిగాయి. జోన్స్ నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా? ఒంటరిగానే అంతమందిని సూసైడ్కి ఉసిగొల్పాడా? ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అమెరికా ప్రమేయం ఉందా?.. ఇలాంటి అనుమానాల మీద చర్చ జరిగింది. కానీ, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోవడంతో ఆ అనుమానాలు నీరుగారిపోయాయి. జోన్స్టౌన్ ఇన్సిడెంట్ మోడ్రన్ కల్చర్లోనూ బాగా పాపులర్ అయ్యింది. డాక్యుమెంటరీలు, ఐదు టెలివిజన్ షోలు, ఐదు సినిమాలు, ఆరు ఫిక్షనల్ నవలలు, ఇరవై ఐదు పాప్ సాంగ్స్, ఐదు కవితలు, ఒక థియేటర్ ప్లేగా అలరించాయి. జోన్స్టౌన్ నరమేధం.. అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మాస్ సూసైడ్ (మర్డర్). కానీ, దీని వెనుక ఉంది మాత్రం ఒక మతబోధకుడి పిరికితనం. అమెరికన్ కల్ట్ లీడర్గా. ప్రీచర్గా, సెల్ఫ్ప్రొఫెస్డ్ ఫెయిత్ హీలర్గా సొసైటీలో ఒక గౌరవం సంపాదించుకున్న జిమ్జోన్స్.. వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఒక ఉన్మాదిగా చరిత్రలోకి ఎక్కాడు.
జోన్స్ బ్యాక్గ్రౌండ్
జిమ్ జోన్స్.. పూర్తి పేరు జేమ్స్ వారెన్ జోన్స్.. 1931లో ఇండియానాలోని క్రెటెలో పుట్టాడు. అతని తండ్రి ఆర్మీ ఆఫీసర్. మొదట్లో జిమ్పై లెఫ్టిస్టుల ప్రభావం ఉండేది. స్టాలిన్, మావోతో పాటు కారల్ మార్క్స్, గాంధీ, బుక్చిన్కి సంబంధించిన పుస్తకాలన్నింటినీ చదివాడు. ఆ మిక్స్డ్ ఐడియాలజీలతోనే స్పీచ్లు ఇస్తూ.. జనాల్ని ఆకర్షించాడు. మొరటుగా కనిపించే జోన్స్.. యానిమల్ లవర్ కూడా. 1960లో ఇండియానాపొలిస్కి హ్యూమన్ రైట్స్ కమీషన్కి డైరెక్టర్గా పని చేశాడు జోన్స్. ఆ టైంలో రేసిజానికి వ్యతిరేకంగా మూమెంట్ నడిపించాడు. వైట్ ఫ్యామిలీస్ని కలిసి కౌన్సెలింగ్ ఇచ్చేవాడు. సీక్రెట్గా స్టింగ్ ఆపరేషన్స్ చేపట్టి.. సొసైటీ బ్లాక్ పీపుల్ ఎదుర్కొంటున్న వర్ణవివక్షను ఎండగట్టాడు. అయితే ఈ విషయంలో జోన్స్కి చావు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా కూడా జోన్స్ ధైర్యంగా ముందుకెళ్లాడు. ఆ గట్స్ చూసే వేల మంది అతనికి అనుచరులుగా మారారు. రేసిజంపై జోన్స్ జరిపిన పోరాటానికి ‘మార్టిన్ లూథర్ కింగ్ హ్యుమానిటేరియన్’ అవార్డు కూడా దక్కింది. అయితే చర్చ్మ్యాన్గా ఉన్న టైంలోనే మార్సెలినె బాల్దివిన్ని పెండ్లి చేసుకున్నాడు జోన్స్. వీళ్లకు ఒక కొడుకు. మహాత్మా గాంధీపై అభిమానంతో కొడుక్కి స్టీఫెన్ గాంధీ అని పేరు పెట్టాడు జిమ్జోన్స్. జోన్స్ కపుల్కి ఆదర్శాలు ఎక్కువ. ‘రెయిన్ బో ఫ్యామిలీ’ పేరుతో తొమ్మిది మంది అనాథల్ని దత్తత తీసుకున్నారు. అయితే మరో యాంగిల్లో అతనిపై విమర్శలు కూడా వినిపించేవి. పీపుల్స్ టెంపుల్ సాకుతో దందాలు నడిపాడని, ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేవాడని, అతనొక విమనైజర్ అని చెప్తుంటారు కొందరు. అంతేకాదు ఒకసారి ఓ సినిమా హాలులో పబ్లిక్గా పాడుపని చేసి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. చివరికి.. 47 ఏండ్ల వయసులో ప్రాణభయంతో తానొక్కడే కాకుండా.. వందల మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు.
– శుభాశ్రీ