రిమ్స్ లో ఆందోళనలు విరమించిన జూడాలు

రిమ్స్ లో ఆందోళనలు విరమించిన జూడాలు

ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్  రిమ్స్​ఆస్పత్రిలో జూనియర్  డాక్టర్లు తమ ఆందోళనను విరమించారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్  అరుణ్  ప్రకటించారు. డైరెక్టర్ ను తొలగించాలంటూ శనివారం సైతం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెడికల్  కళాశాల ముందు జూడాలు బైఠాయించారు. మధ్యాహ్నం తరువాత డైరెక్టర్ తో పాటు రిమ్స్ ప్రొఫెసర్లు, డీఎంహెచ్ఓ నరేందర్  రాథోడ్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించేందుకు జూడాలు ఒప్పుకున్నారు.

ఈ సందర్భంగా సమ్మె విరమణ పత్రాన్ని డైరెక్టర్  జైసింగ్  రాథోడ్ కు అందజేశారు. జూనియర్  డాక్టర్ల హాస్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కాలేజీ ఆవరణ అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్  తెలిపారు. తన పరిధిలో లేని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డైరెక్టర్  హామీ ఇచ్చారు.