- గుర్తు తెలియని డెడ్ బాడీల వద్ద లభించని ఆధారాలు
- మర్డర్ కేసుల్లో ముందుకు సాగని ఇన్వెస్టిగేషన్
హైదరాబాద్,వెలుగు : సిటీ పరిధిలో జరుగుతున్న హత్యలు మిస్టరీగా మిగిలిపోతున్నాయి. మృతులకు సంబంధించిన ఆధారాలు దొరక్కపోతుండగా పెండింగ్ కేసుల లిస్ట్లోకి చేరుతున్నాయి. ఒకవేళ మృతుల వివరాలు లభించినా హంతకులు ఎవరనేది పోలీసులకు ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి. ఇలా చాలా కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ కేటరిగిలో పోలీస్ స్టేషన్లలోనే అటకెక్కుతున్నాయి. ఇలాంటివే ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో చాలా హత్య కేసులు దర్యాప్తు కూడా నోచుకోవడం లేదు. మరోవైపు డెడ్బాడీ ఎవరిది అనేది గుర్తించకుండా హంతకులు ఆధారాలను మాయం చేస్తున్నారు. ఇలా గ్రేటర్ సిటీ పరిధిలో జరిగిన హత్యలు మిస్టరీగా మారాయి.
పోలీసులకు ఆధార్ డేటా యాక్సెస్ లేకపోవడంతో
గుర్తు తెలియని డెడ్బాడీలను ఆధార్ నంబర్తో గుర్తించే అవకాశాలు ఉంటాయి. మృతదేహం ఫింగర్ ప్రింట్స్ను ఆధార్ బయోమెట్రిక్ చెక్ చేస్తే మృతుడి వివరాలు లభిస్తాయి. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆధార్ బయోమెట్రిక్ చేసే అనుమతి ఇతర సంస్థలకు లేదు. పోలీసులు,సెంట్రల్ దర్యాప్తు సంస్థలకు కూడా ఆధార్ డేటా యాక్సెస్ లేదు. ఆ ఫెసిలిటీ ఉంటే ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మృతుల వివరాలు తెలుసుకునే చాన్స్ ఉంటుంది. అయితే..
ఆధార్ డేటాను ఇతరులకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం వాటిల్లుతుందని ఆధార్ డెవలపర్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సీసీ టీవీ ఫుటేజ్,సైంటిఫిక్ ఎవిడెన్స్తో పోలీసులు ఎన్నో కేసులు ఛేదిస్తున్నారు. కానీ గుర్తు తెలియని డెడ్బాడీలను గుర్తించడంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇలా ఏటా వందల సంఖ్యలో గుర్తు తెలియని డెడ్ బాడీల కేసులు పెండింగ్లో ఉంటున్నాయి.
ఈ నెల16న ఆదిబట్ల పీఎస్ పరిధి బ్రాహ్మపల్లిలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఓ డెడ్బాడీ దొరికింది. మృతుడు ఎవరిదనేది గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. ఇందుకు కారణం గుర్తించలేని విధంగా డెడ్ బాడీ కుళ్లిపోయింది. ఒంటి మీద గోల్డ్ ఆర్నమెంట్ తప్ప ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు కూడా లేవు. దీంతో బొంగుళూర్ టోల్గేట్ వద్ద సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. వాటిలో అనుమానాస్పద వెహికల్ ఏదీ కనిపించలేదు. దీంతో మృతుడు ఎవరనేది గుర్తించడం పోలీసులకు సవాల్గా నిలుస్తుంది.
నవంబర్, 2021లో పెద్ద అంబర్పేట్ పరిధిలోని కొహెడ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీసు రోడ్డు కాలువలో ఓ గుర్తు తెలియని మహిళ డెడ్బాడీ లభించింది. ఆమెకు 30 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. ఒంటిపై బ్లాక్ కలర్ టీ షర్ట్, పాయింట్మినహా డెడ్బాడీ వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మృతురాలు నార్త్ ఇండియాకు చెందిన మహిళగా అనుమానించారు. కేసులో భాగంగా రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించారు. అయినా ఎలాంటి వివరాలు లభించలేదు. దీంతో మృతురాలి ఫొటోతో లుక్ ఔట్ నోటీసు లు జారీ చేశారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. రెండేండ్లు దాటినా కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.