మేడారంలో పెరిగిన రద్దీ.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు

మేడారంలో పెరిగిన రద్దీ.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, మహారాష్ట్ర నుంచి భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. తర్వాత చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అడవిలో వనభోజనాలు చేశారు. 

మేడారం హుండీ లెక్కింపు

మేడారం వనదేవతల ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా రూ. 36 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తం మూడు నెలలకు సంబంధించిన హుండీలను బుధవారం కరీంనగర్ శ్రీవల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో లెక్కించారు. సమ్మక్క గద్దె వద్ద ఏర్పాటు చేసిన తొమ్మిది హుండీల ద్వారా రూ. 18,36,233లు రాగా.. సమ్మక్క గద్దె వద్ద ఉన్న తొమ్మిది హుండీల ద్వారా రూ.16,59,383 ఆదాయం వచ్చింది. అలాగే పగిడిద్దరాజు గద్దె వద్ద రూ. 72,289, గోవిందరాజుల గద్దె వద్ద రూ. 81,468 కలిపి మొత్తం రూ. 36,49,363 ఆదాయం వచ్చినట్లు ఈవో వీరస్వామి తెలిపారు.

జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు

మేడారంలోని జంపన్న వాగు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిధులతో జంపన్న వాగు వద్ద వివిధ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. నిధుల విడుదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.