- పాక్ పిలుస్తోంది... నేడు ఇంగ్లండ్తో టీమిండియా సెమీఫైనల్
- గెలిచి ఫైనల్లో పాకిస్తాన్ను ఢీకొట్టాలని ఆశిస్తున్న రోహిత్సేన
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
అడిలైడ్: అదృష్టం కలిసొచ్చి సెమీస్ చేరిన పాకిస్తాన్.. అద్భుత ఆటతో న్యూజిలాండ్ను పడగొట్టి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తన ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తోంది. ఇరు దేశాల ఫ్యాన్సే కాకుండా ఇతర దేశాల క్రికెటర్లు సైతం ఆదివారం మెల్బోర్న్ మెగా ఫైనల్లో ఇండియా–పాక్ ఆడాలని ఆశిస్తున్నారు. అది జరగాలంటే టీమిండియా ముందుగా సెమీఫైనల్ గండాన్ని గట్టెక్కాల్సి ఉంది. గురువారం జరిగే రెండో సెమీస్లో బలమైన ఇంగ్లండ్తో రోహిత్సేన అమీతుమీ తేల్చుకోనుంది. మెగా టోర్నీ సూపర్12లో ఇండియా సూపర్ పెర్ఫామెన్స్ చేయగా.. ఇంగ్లిష్ టీమ్ పడుతూ లేస్తూ ముందుకొచ్చింది. టోర్నీలో ఇప్పటిదాకా తమ బెస్ట్ క్రికెట్ ఆడలేదని ఆ టీమ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అంటున్నాడు. స్టోక్స్, కెప్టెన్ జోస్ బట్లర్ తమ బెస్ట్ ఇవ్వకూడదని ఇండియన్స్ కోరుకోవాలి. ఇక, ఐసీసీ ఈవెంట్ల నాకౌట్స్లో హిస్టరీ ఇండియాకు ప్రతికూలంగా ఉంది. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్తో పాటు 2019 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో ఓడి నిరాశ పరిచింది.
ఈ మ్యాచ్లన్నింటిలో రోహిత్ ఆడినప్పటికీ తను కెప్టెన్ కాదు. ఇప్పుడు నాయకుడిగా అత్యంత కఠిన ఫేజ్లో ఉన్న హిట్మ్యాన్.. ఆ ఓటములతో పాటు నెట్ ప్రాక్టీస్లో అయిన గాయం బాధను మరచి జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్ల్లో 89 రన్స్ మాత్రమే చేసిన కెప్టెన్ బ్యాట్ ఝుళిపించి తన సత్తాను చాటుకునేందుకు సెమీస్కు మించిన మ్యాచ్ మరోటి ఉండబోదు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ సూపర్ ఫామ్ జట్టుకు ప్లస్ పాయింట్. ఈ ఇద్దరిలో ఒక్కరు చెలరేగినా ఇంగ్లిష్ బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. ఆదిల్ రషీద్ స్పిన్కు కోహ్లీ, సామ్ కరన్ కట్టర్స్కు సూర్య ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే వీళ్లకు టాపార్డర్లో రోహిత్.. మిడిలార్డర్లో హార్దిక్ కూడా తోడైతేనే జట్టు భారీ స్కోరు చేయగలదు.. టార్గెట్ను ఛేజ్ చేయగలదు. బ్యాట్తో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న హార్దిక్.. ఇంగ్లిష్ స్టార్ ఆల్రౌండర్ స్టోక్స్ బలాన్ని మ్యాచ్ చేయాల్సి ఉంది. పేస్ త్రయం భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్ ఫామ్లో ఉండగా.. అశ్విన్ కూడా తెలివైన బాల్స్ వేస్తుండటం ప్లస్ పాయింట్ కానుంది.
పంత్, చహల్ ఉంటారా?
సూపర్12లో ఇండియా ఐదింటిలో నాలుగు గెలిచింది. కానీ, ప్రతీసారి తుది జట్టు ఎంపికపైనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఐదో నంబర్లో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్లో ఎవరిని కొనసాగించాలో తేల్చుకోలేకపోతోంది. ఈ ఇద్దరూ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే, సైడ్ బౌండ్రీ దూరం తక్కువగా ఉండటం, లెగ్ స్పిన్నర్ రషీద్ను కౌంటర్ చేసేందుకు పంత్ బెస్ట్ చాయిస్ అనిపిస్తోంది. అక్షర్ పటేల్, చహల్ విషయంలోనూ అదే చర్చ ఉంది. ఆఫ్ స్పిన్నర్ అక్షర్ (3 వికెట్లు) పెద్దగా రాణించడం లేదు. కానీ, లెగ్ స్పిన్నర్ చహల్ను బరిలోకి దింపేందుకు మేనేజ్మెంట్ వెనకాడుతోంది. అడిలైడ్లో కొత్త పిచ్పై చహల్ స్పిన్ జట్టుకు పనికొచ్చేలా ఉంది. మరి, అతడిని ఆడించే ధైర్యం చేస్తుందో లేదో చూడాలి.