- ఫీజ్ రీయింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్.
 
నిర్మల్, వెలుగు: పెండింగ్లో ఉన్న ఫీజ్ రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలోని 23 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిరవధిక బంద్లో పాల్గొన్నాయి. కాలేజీలను యాజమాన్యాలు మూసివేసి నిరసన తెలిపాయి. కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు అఖిలేశ్ కుమార్ సింగ్, వెంకట్ రెడ్డి, నరేశ్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేండ్లుగా డిగ్రీ కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని ప్రతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా.. కేవలం రీయింబర్స్మెంట్ నిధులతో సాగే కాలేజీలను నిధులు లేకుండా నడపడం సాధ్యం కావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం విడతల వారీగానైనా రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.
