కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజలంతా వాడవాడలా దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక మల్టీప్లెక్స్  థియేటర్ లో  గాంధీ సినిమా చూసిన అనంతరం వారు మాట్లాడారు. గాంధీ శాంతియుత పోరాటం, పట్టుదలను విద్యార్థులకు తెలియజెప్పేందుకు ప్రభుత్వం ఉచితంగా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిందన్నారు. ఆగస్టు 11 నుంచి 21వరకు కరీంనగర్ జిల్లాలోని 13 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తామ‌‌‌‌ని చెప్పారు.

వజ్రోత్సవంలో మొక్కలు నాటిన మంత్రి

దేశ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం స్థానిక 7వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ ఫ్రీడమ్ పార్క్ లో  వినోద్ కుమార్ తో కలిసి మంత్రి గంగుల మొక్కలు నాటారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు  పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 15 రోజులు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్, కార్పొరేటర్లు వేణు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి

కొత్తపల్లి: పట్టణాన్ని అన్నిరంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి కమలాకర్​ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో స్థానిక జడ్పీహెచ్​ఎస్​లో ఆయన మొక్కలు నాటారు. టీయూఎఫ్​ఐడీసీ నిధులు రూ.6 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ కట్ల వేణుమాధవ్, కౌన్సిలర్లు రమేశ్​, మొండయ్య, వేణుగోపాల్, విజయ- పాల్గొన్నారు.