బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ పోటీల తొలి రోజు ఇండియా ఆశాజనక ఫలితాలు రాబట్టింది. శుక్రవారం జరిగిన హాకీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్లో విజయాలతో బోణీ చేసింది. ఇండియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ టీమ్... పాకిస్తాన్ను చిత్తుగా ఓడించగా, బాక్సర్ శివథాపా అదే దేశానికి చెందిన ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించాడు. అయితే, తొలి రోజు పతక పోటీలైన సైక్లింగ్, ట్రయథ్లాన్, స్విమ్మింగ్తో పాటు లాన్ బాల్స్లో నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. కానీ, ఎన్నో అంచనాలున్న విమెన్స్ టీ20 క్రికెట్లో ఇండియా టీమ్కు చుక్కెదురైంది. కాగా, శనివారం నుంచి ఇండియా పతకాల వేట ప్రారంభించనుంది. గత ఎడిషన్ గోల్డ్ మెడలిస్ట్, స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సహా నలుగురు వెయిట్ లిఫ్టర్లు బరిలో నిలిచారు. మీరా నుంచి కచ్చితంగా పతకం ఆశించొచ్చు.
షట్లర్లు, ప్యాడ్లర్లు సూపర్
బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంప్ ఇండియా గ్రూప్–-ఎ తొలి మ్యాచ్లో 5–-0తో పాకిస్తాన్పై క్లీన్స్వీప్ విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి-–అశ్విని పొన్నప్ప, సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధుతో పాటు మెన్స్ డబుల్స్లో సాత్విక్–-చిరాగ్, విమెన్స్ డబుల్స్లో పుల్లెల గాయత్రి–-ట్రీసా తమ ప్రత్యర్థులపై వరుస గేమ్స్లో విజయాలు సాధించి ఇండియాను గెలిపించారు. ఇక, హాకీలో ఇండియా విమెన్స్ టీమ్ తొలి మ్యాచ్లో 5–-0తో చిన్న జట్టు ఘనాను చిత్తు చేసింది. గుర్జీత్ కౌర్ (3, 39వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేయగా.. నేహా గోయల్(28వ. ని.), సంగీత కుమారి (36వ ని.), సలిమా టెటే (56వ ని.) తలో గోల్ చేశారు. మరోవైపు టేబుల్ టెన్నిస్లో ఇండియా మెన్స్, విమెన్స్ జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్–3 తొలి మ్యాచ్లో మెన్స్ టీమ్ 3–0తో చిన్న జట్టు బార్బడోస్ను చిత్తు చేసింది. సింగిల్స్లో శరత్ కమల్, సత్యన్ నెగ్గగా, డబుల్స్లో హర్మీత్ దేశాయ్–సత్యయ్ జంట గెలిచింది. విమెన్స్లో ఇండియా 3–0తో సౌతాఫ్రికాను ఓడించింది. ఆకుల శ్రీజ సింగిల్స్తో పాటు డబుల్స్లో విజయాలు సాధించగా.. స్టార్ ప్యాడ్లర్ మనికా మరో సింగిల్స్లో గెలిచింది.
శివ థాపా పంచ్ పవర్
ఇండియా స్టార్ బాక్సర్ శివ థాపా అదిరిపోయే విజయంతో కామన్వెల్త్లో తన పోరు ఆరంభించాడు. 63.5 కేజీ తొలి రౌండ్లో థాపా 5–0తో పాకిస్తాన్కు చెందిన సులేమన్ బలోచ్ను చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. శివ పంచ్ పవర్కు పాక్ బాక్సర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
సెమీస్లో శ్రీహరి
మెన్స్ 100 మీ. బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో శ్రీహరి నటరాజన్ 58.68 సెకండ్లతో హీట్స్ లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాడు. కానీ, 50మీ. బటర్ఫైలో సాజన్, 400మీ. ఫ్రీస్టయిల్ లో కుశాగ్ర నిరాశ పరిచారు. తొలి రోజు ఇండియా సైక్లిస్ట్లు మూడు టీమ్ ఈవెంట్లలోనూ ఫైనల్ చేరుకోలేకపోయారు.లాన్ బాల్స్లో విమెన్స్ సింగిల్స్ ప్లేయర్ తానియా చౌదరితో పాటు మెన్స్ ట్రిపుల్ టీమ్ రెండు మ్యాచ్ల్లో ఓడిపోయాయి. ట్రయథ్లాన్ మెన్స్, విమెన్స్ ఫైనల్స్లో ఆదర్శ్, విశ్వనాథ్, ప్రజ్ఞా మోహన్, సంజనా పతకాలకు చాలా దూరంలో నిలిచిపోయారు.
క్రికెట్ హిట్టు... ఇండియా ఫట్టు..
కామన్వెల్త్లో కొత్తగా ప్రవేశపెట్టిన విమెన్స్ టీ20 క్రికెట్ హిట్ కొట్టింది. తొలి పోరుకు 25 వేల కెపాసిటీ ఉన్న ఎడ్జ్బాస్టన్ స్టేడియం దాదాపు నిండిపోయింది. కానీ, ఈ మ్యాచ్ (గ్రూప్–ఎ) లో ఇండియా 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 154/8 స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (52), షెఫాలీ వర్మ (48) రాణించారు. అనంతరం ఛేజింగ్కు వచ్చిన ఆసీస్ 19 ఓవర్లలో 157/7 స్కోరు చేసి గెలిచింది. రేణుకా సింగ్ (4/18), దీప్తి శర్మ (2/24) దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ యాష్లీ గార్డ్నర్ (52 నాటౌట్) ఆసీస్ను గెలిపించింది.