
నవీ ముంబై: మూడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇండియా విమెన్స్ జట్టు.. వన్డే వరల్డ్ కప్లో కీలక పోరుకు రెడీ అయ్యింది. గురువారం జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ పోరులో గెలిస్తేనే.. ఇండియాకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఒకవేళ ఓడితే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్.. న్యూజిలాండ్ను ఓడించాలి. అదే టైమ్లో బంగ్లాదేశ్పై ఇండియా కచ్చితంగా నెగ్గితేనే హర్మన్సేనకు నాకౌట్ బెర్త్ ఖాయమవుతుంది.
ఈ నేపథ్యంలో బాగా పట్టున్న డీవై పాటిల్ స్టేడియంలో కివీస్తో జరిగే ఈ పోరులోనే కచ్చితంగా గెలవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్తో జరిగిన గత మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడినా ఓటమి ఎదురుకావడాన్ని ఇండియా జీర్ణించుకోలేకపోతున్నది. ముఖ్యంగా ఆసీస్, సౌతాఫ్రికా ఛేజింగ్లో ఇండియా బౌలింగ్ను దీటుగా ఆడాయి. ఇక ఇంగ్లండ్తో మ్యాచ్లో ఇండియా 7 వికెట్లు చేతిలో ఉన్నా 54 బాల్స్లో 56 రన్స్ చేయలేకపోయింది. దాంతో ఇప్పుడు బౌలింగ్, బ్యాటింగ్ను మళ్లీ సరి చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు టాప్ బ్యాటర్లు ఎవరూ మ్యాచ్ను ముగించేంత వరకు క్రీజులో నిలవలేదు.
బౌలర్ల పెర్ఫామెన్స్ కూడా నిలకడగా లేదు. భారీ హిట్టింగ్ కోసం రిచా ఘోష్ను అతిగా నమ్మడం మైనస్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్కు వెన్నెముకగా ఉన్న హర్మన్ప్రీత్, స్మృతి మంధానాపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అనుకోని పరిస్థితుల్లో వీళ్లు ఫెయిలైతే మిగతా లైనప్ పేకమేడలా కూలుతోంది. ఆరో బౌలర్కు చోటు కల్పించడం కోసం జెమీమాను పక్కన బెట్టి.. స్వింగ్ బౌలర్ రేణుకా ఠాకూర్ను ఆడిస్తున్నారు.
ఈ స్ట్రాటజీ సక్సెస్ కాకపోవడంతో పాటు హర్లీన్ డియోల్పై అధిక ఒత్తిడి పెంచింది. కాబట్టి కాంబినేషన్స్ను మరోసారి సరిచూసుకుని బరిలోకి దిగితేనే అనుకున్న ఫలితాన్ని రాబట్టొచ్చు. డీవై పాటిల్ పిచ్ బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్గా అంచనా వేస్తున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లు మంచును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఛేజింగ్లో బంతిపై పట్టు లభించక బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. మరోవైపు కొలంబోలో ఆడిన రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడంతో కివీస్ పూర్తి విజయంపై దృష్టి సారించింది. సోఫీ డివైన్, సుజీ బేట్స్ నుంచి ఇండియాకు పరీక్ష తప్పదు.