హాంగ్జౌ: రెండు చేతులు లేకున్నా ఆర్చరీలో అద్భుతాలు చేస్తున్న ఇండియా టీనేజర్ శీతల్ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా పారా గేమ్స్ ఒకే ఎడిషన్లో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచిన ఇండియా తొలి మహిళగా రికార్డు సాధించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఈవెంట్లో గోల్డ్ నెగ్గి ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఫైనల్లో శీతల్ 144–142 స్కోరుతో సింగపూర్కు చెందిన నూర్ సియాహిదాను ఓడించింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన 16 ఏండ్ల శీతల్ ఇప్పటికే కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్తో పాటు డబుల్స్లో సిల్వర్ సాధించింది. పాదాలతో బాణాలు వేస్తున్న ఏకైక విమెన్ ఇంటర్నేషనల్ ఆర్చర్ శీతల్ కావడం విశేషం.
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లోని మారుమూల ప్రాంతానికి చెందిన శీతల్ ఫోకోమెలియాతో అనే వైకల్యంతో జన్మించింది. చేతులు లేకున్నా అప్పర్ బాడీ బలంగా ఉండటంతో శీతల్ కాళ్లతోనే చెట్లు ఎక్కేది. అలా 2021లో ఆమె స్వగ్రామంలో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఓ యూత్ ఈవెంట్లో ఆటల్లో తన ప్రతిభను చాటుకుంది. దాంతో కోచ్లు, ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు కృత్రిమ చేతిని ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా.. అది ఆమెకు ఫిట్ అవ్వలేదు. కొంత నిరాశ చెందినప్పటికీ శీతల్ పట్టు వదల్లేదు.
వైద్య పరీక్షలో అప్పర్ బాడీ బలంగా ఉందని తేలడంతో ఆర్చరీ ఆమెకు సూట్ అవుతుందని కోచ్లు నిర్ణయించారు. దాంతో, ఆర్చరీ కోచ్ కుల్దీప్ కుమార్ అకాడమీలో చేరి జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు నెగ్గడం ప్రారంభించిన శీతల్ రెండేండ్లలోనే అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది జులైలో పారా వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో పాల్గొని రెండు చేతులు లేకుండా పతకం నెగ్గిన తొలి మహిళగా నిలిచింది.
ఇండియా జోరు
ఆసియా పారా గేమ్స్లో ఇండియా మెడల్స్ సంఖ్య 99కి చేరుకుంది. శుక్రవారం ఒక్క రోజే ఏడు గోల్డ్ సహా 17 మెడల్స్ సాధించింది. శీతల్తో పాటు పారా షట్లర్ ప్రమోద్ భగత్ గోల్డ్ నెగ్గాడు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీ ఫైనల్లో ప్రమోద్ 22–20, 21–19తో ఇండియాకే చెందిన నితేశ్ కుమార్ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ ఎస్ఎల్4 కేటగిరీలో గోల్డ్ రాబట్టాడు. విమెన్స్లో తులస్మతి గోల్డ్, మనీషా బ్రాంజ్ గెలిచారు. మెన్స్ డబుల్స్లో నితేశ్–తరుణ్ మరో గోల్డ్ రాబట్టగా.. ప్రమోద్– సుకాంత్ బ్రాంజ్ నెగ్గారు. అథ్లెటిక్స్లో రమన్ శర్మ మెన్స్ 1500 మీటర్ల టీ38 ఈవెంట్లో ఆసియా గేమ్స్ రికార్డును బ్రేక్ చేస్తూ బంగారు పతకం గెలవగా, జావెలిన్ త్రోయర్లు ప్రదీప్ కుమార్, లక్షిత్ సిల్వర్, బ్రాంజ్ సొంతం చేసుకున్నారు.