
- ప్రపోజల్కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం చేపట్టిన భారత్నెట్ ప్రాజెక్ట్ కోసం రూ.1.39 లక్షల కోట్లు కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా రౌండ్లకు నిధులు ఇచ్చే ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం 1.94 లక్షల గ్రామాలకు ఈ ప్రాజెక్టు కింద నెట్ కనెక్టివిటీ ఇచ్చారు. వచ్చే 2.5 ఏళ్లలో మిగిలిన గ్రామాలకు నెట్కనెక్టివిటీ రానుంది.
దేశంలోని అన్ని గ్రామాలకు లాస్ట్మైల్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత కనెక్టివిటీని అందించడానికి రూ.1,39,579 కోట్ల నిధులను ఇవ్వాలన్న ప్రపోజల్ను కేబినెట్ ఆమోదించింది. భారత్నెట్ ప్రపంచంలోని అతిపెద్ద గ్రామీణ టెలికాం ప్రాజెక్ట్లలో ఒకటి. దేశంలోని మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు లాస్ట్మైల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కోసం దీనిని దశలవారీగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదటిసారి అక్టోబర్ 2011లో క్యాబినెట్ ఆమోదం పొందింది. స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) గా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ (బీబీఎన్ఎల్) ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. రెండోదశకు 2017లో ఆమోదం లభించింది. రెండు దశల్లో ప్రాజెక్ట్ కోసం రూ.42,068 కోట్లు ఇచ్చారు.
విలేజ్ ఎంటర్ప్రెనూర్లతో టై-అప్
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) విభాగమైన బీబీఎన్ఎల్, కనెక్టివిటీని అందించడానికి విలేజ్ లెవెల్ ఎంట్రప్రెనూర్లతో (వీఎల్ఈలు) కలసి పనిచేస్తుంది. “పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత స్థానిక ఎంట్రప్రెనూర్ల సహాయంతో ఫైబర్ని ఇంటికి తీసుకెళ్లే నమూనాను ఖరారు చేశాం. నాలుగు జిల్లాల్లోని గ్రామాలను నెట్ద్వారా అనుసంధానం చేసేందుకు మొదట పైలట్ ప్రాజెక్ట్ను నిర్వహించాం. తరువాత ఇది చాలా రాష్ట్రాల్లోని 60వేల గ్రామాలకు విస్తరించింది.
ఆశించిన ఫలితాలు వచ్చాయి ”అని మరో అధికారి తెలిపారు. మొత్తం 3.51 లక్షల బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లను అందించామని, ఈ పైలట్ ప్రాజెక్ట్లో దాదాపు 3,800 మంది ఎంట్రపెనూర్లు పాల్గొన్నారని అధికారి తెలిపారు. ప్రతి ఇంటికి సగటు డేటా వినియోగం నెలకు 175 గిగా బైట్ల వరకు నమోదయింది. బీబీఎన్ఎల్, వీఎల్ఈల మధ్య 50 శాతం రాబడి వాటా విధానంలో(రెవెన్యూ షేర్) ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. నెలవారీ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ధర రూ.399 నుంచి ప్రారంభమవుతుంది. 30ఎంబీపీఎస్ వేగం గల ప్లాన్కు నెలకు రూ.799 వరకు కట్టాలి. దేశంలో 37 లక్షల రూట్ కిలోమీటర్ల (ఆర్కెఎమ్) ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సి) ఏర్పాటు కాగా, వీటిలో బీబీఎన్ఎల్ 7.7 లక్షల ఆర్కేఎమ్ ఓఎఫ్సిని ఏర్పాటు చేసింది.