
- సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు
- ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ కార్యదర్శి గోవింద్మోహన్
- శ్రీనగర్లోని దాల్ లేక్లో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎస్డీఆర్ఎఫ్
- జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో ప్రధాని మోదీ భేటీ
- దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చ
- సికింద్రాబాద్, గోల్కొండ,డీఆర్డీవో, మౌలాలిలో మాక్ డ్రిల్
న్యూఢిల్లీ: పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ ఉందని అనుమానిస్తున్న భారత్.. ఆ దేశానికి గట్టిగా బదులిచ్చేందుకు అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోదీ మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. అత్యవసర సమయాల్లో ఎలా వ్యవహవరించాలి అనేదానిపై దేశ ప్రజలను సమాయత్తం చేసేందుకు బుధవారం ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలిచ్చింది.
ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహణపై ఆ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం కీలక మీటింగ్ జరిగింది. ఇందులో సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డీజీలు, ఎన్డీఎంఏ అధికారులు పాల్గొన్నారు. సీఎస్లతో గోవింద్ మోహన్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాక్ డ్రిల్స్పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేశారు. శత్రువులు దాడి చేస్తే మనకు మనం ఎలా కాపాడుకోవాలి? ఈ సమయంలో విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలనే దానిపై అవగాహన కల్పించాలని సూచించారు.
మాక్ డ్రిల్కు సిద్ధం
కేంద్రం ఆదేశాల మేరకు మాక్డ్రిల్ నిర్వహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధమయ్యాయి. 1971 తర్వాత ఆ స్థాయిలో మళ్లీ నేడు దేశవ్యాప్తంగా తొలిసారి మాక్డ్రిల్ జరగనున్నది. హోం మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలోని 244 జిల్లాల్లో ఈ డ్రిల్ నిర్వహిస్తారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నాన్ని మాక్డ్రిల్కోసం ఎంపిక చేశారు.
ఇందులో అధికారులతోపాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువకేంద్రాలు (ఎన్వైకేఎస్), కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను భాగస్వాముల్ని చేయనున్నారు. ఈ డ్రిల్ను గ్రామస్థాయి వరకు నిర్వహించాలని కేంద్రం హోం శాఖ ప్లాన్ చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు, అధికారులు ఎలా వ్యవహరించాలనేదానిపై అవగాహన కల్పించడమే
లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దాల్ సరస్సులో మాక్ డ్రిల్
కేంద్రం ఆదేశాల మేరకు జమ్మూకాశ్మీర్లోని దాల్ సరస్సులో ఎస్డీఆర్ఎఫ్ బృందం మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించింది. పడవ బోల్తాపడ్డప్పడు ఎలా వ్యవహరించాలనే దానిపై కసరత్తు చేసింది. పర్యాటకులు లేదా స్థానికులు ఉన్న పడవ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయాలనేది ప్రాక్టీస్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలేకాదు.. అత్యవసర పరిస్థితులలాంటి ఏ సవాళ్లు ఎదురైనా తాము సిద్ధమని ప్రదర్శన ద్వారా వెల్లడించారు.
మాక్ డ్రిల్ చేసేదిలా..
- ఈ మాక్ డ్రిల్ను యుద్ధం లేదా ఎయిర్స్ట్రైక్స్లాంటి అత్యవసర పరిస్థితుల్లో పౌరులను సన్నద్ధం చేయడానికి, భద్రత, సమన్వయం, అవగాహన పెంచడంకోసం నిర్వహిస్తారు. శత్రుదేశపు ఫైటర్ జెట్లు, మిసైల్స్, డ్రోన్లు దూసుకొస్తే ఏం చేయాలనేదానిపై ప్రజలకు శిక్షణ ఇస్తారు. ఇందులో సైరన్ అత్యంత కీలకమైంది.
- ఈ డ్రిల్తో గగనతల దాడులు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో సైరన్లు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో అంచనా వేస్తారు.
- వైమానిక దాడి జరిగినప్పుడు వేగంగా, సురక్షితంగా స్పందించడానికి శిక్షణ ఇస్తారు.
- సివిల్ అధికారులు, భారత వైమానిక దళం మధ్య హాట్లైన్, రేడియో కమ్యూనికేషన్ను వినియోగంలోకి తెస్తారు.
- అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్స్, షాడో రూమ్స్ పని తీరును చెక్ చేస్తారు.
- శత్రు దాడుల సమయంలో సివిల్ డిఫెన్స్ టెక్నిక్స్తో తమను తాము రక్షించుకునేలా విద్యార్థులు సహా ప్రజలందరికీ శిక్షణ ఇస్తారు.
- బ్లాకౌట్స్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పిస్తారు. ఎయిర్రైడ్ సమయంలో లైట్లు స్విచ్ఛాప్ చేయాలని కోరుతారు.
- వైమానిక స్థావరాలు, రైలు యార్డులు, రిఫైనరీలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను దాడుల నుంచి రక్షించడానికి ప్రాక్టీస్ చేస్తారు.
- రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంసిద్ధతను పరీక్షిస్తారు. ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిహార్సల్ చేస్తారు.
- ఫస్ట్ ఎయిడ్, ఫైర్ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ నిర్వహణ, ఎమర్జెన్సీ సమయంలో షెల్టర్లోకి వెళ్లడంలాంటి వాటిపై పౌరులకు ట్రెయినింగ్ ఇస్తారు.