న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో ఓ విచిత్రమైన కారణంతో ఇండియా గోల్డ్ మెడల్ను చేజార్చుకుంది. గురువారం జరిగిన జూనియర్ మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఉమామహేశ్ మద్దినేని–ధనుష్ శ్రీకాంత్–అభినవ్ షాతో కూడిన ఇండియా త్రయం 1882 పాయింట్లు సాధించింది. దీంతో ఆసియా జూనియర్ రికార్డును బ్రేక్ చేసిన ఇండియాకు గోల్డ్ మెడల్ దక్కాలి. కానీ ముగ్గురు షూటర్లలో ఒకరైన ధనుష్ వేసుకున్న ట్రౌజర్ ధృఢత్వం తక్కువగా ఉందని నిర్వాహకులు గోల్డ్ మెడల్ను తిరస్కరించారు.
ఐఎస్ఎస్ఎఫ్ రూల్స్ ప్రకారం షూటర్లు ధరించే ట్రౌజర్ ధృఢత్వం 3.0 మిల్లీ మీటర్లు ఉండాలి. కానీ ధనుష్ ట్రౌజర్ ధృఢత్వం 2.9గా ఉండటంతో అతన్ని డిస్ క్వాలిఫై చేశారు. వాస్తవానికి పోటీకి ముందే షూటర్ల ట్రౌజర్లను ఐదు దశల్లో తనిఖీ చేస్తారు. కానీ నిర్వాహకులు రెండు తనిఖీలు మాత్రమే చేసి తీరా గోల్డ్ వచ్చాక తిరస్కరించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. 10, 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లలో షూటర్ల శరీర కదలికలు చాలా స్వల్పంగా ఉండాలి. దీనికోసం గట్టి జాకెట్లు, ప్యాంట్లు ధరిస్తారు. మరోవైపు విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో సోనమ్ ఉత్తమ్ మస్కర్–గౌతమి బానోత్–జాస్మిన్ కౌర్ 1891.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ను సాధించారు.