యూపీలో ఆధ్యాత్మిక పర్యాటకం వృద్ధి చెందుతోంది
‘వికసిత్ కాశీ’ నుంచి ‘వికసిత్ భారత్’ కల సాకారం
4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
వారణాసి: ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధికి మౌలిక సదుపాయాలు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ కూడా అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా 4 వందే భారత్ రైళ్ల ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
బనారస్ –ఖజురహో, లక్నో– సహరన్పుర్, ఫిరోజ్పూర్– ఢిల్లీ, ఎర్నాకుళం-– బెంగళూరు మార్గాల్లో ఈ 4 రైళ్లు నడవనున్నాయి. ఈ సందర్భంగా బనారస్లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “మౌలిక సదుపాయాలంటే కేవలం పెద్ద వంతెనలు, హైవేలు మాత్రమే కాదు. వాటి ఏర్పాటుతో ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది” అని తెలిపారు.
దేశంలో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని, ప్రపంచ దేశాల నుంచి ఫ్లైట్లు వస్తున్నాయని, ఈ అభివృద్ధి అంతా వృద్ధితో ముడిపడిందన్నారు. వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం అభివృద్ధి పండుగన్నారు. దేశంలో 160కి పైగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్.. భారతీయ రైల్వే తర్వాత తరానికి పునాది అన్నారు. వందే భారత్ రైళ్లను చూసి విదేశీ టూరిస్టులూ ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.
యూపీలో ఆధ్యాత్మిక టూరిజం వృద్ధి..
యూపీలో ఆధ్యాత్మిక టూరిజం వృద్ధి చెందిందని, ప్రధాన ఆదాయ వనరుగా మారిందని మోదీ తెలిపారు. “ప్రయాగ్రాజ్, అయోధ్య, హరిద్వార్, చిత్రకూట్, కురుక్షేత్ర .. ఇవి మన ఆధ్యాత్మిక విశ్వాస కేంద్రాలు” అని చెప్పారు. ఈ పవిత్ర గమ్యస్థానాలు వందే భారత్ నెట్వర్క్తో అనుసంధానమవుతున్నాయని, ఇది దేశ సంస్కృతి, విశ్వాసం, అభివృద్ధిని కలుపుతున్నదని అన్నారు. గత 11 ఏండ్లలో యూపీలో జరిగిన అభివృద్ధి పనులు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయని చెప్పారు.
నిరుడు 11 కోట్లకు పైగా భక్తులు కాశీలోని బాబా విశ్వనాథ్ దర్శనం కోసం వచ్చారని, అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత 6 కోట్లకు పైగా మంది రామ్లల్లా ఆశీస్సులు పొందారని వివరించారు. ఈ భక్తులు యూపీ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయలు అందించారని చెప్పారు. ఇది యువతకు కొత్త అవకాశాలు సృష్టించిందని మోదీ అన్నారు.‘వికసిత్ కాశీ’ నుంచి ‘వికసిత భారత్’ కలను సాకారం చేయడానికి ఇక్కడ అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతున్నామని వెల్లడించారు.
పిల్లల మనసుల్లో ఆర్జేడీ విషం నింపుతోంది
బిహార్లో పిల్లల మనసులను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) విషంతో నింపుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. బిహార్లోని సీతామర్హిలో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. స్టూడెంట్స్కు తాము ల్యాప్టాప్లు ఇస్తే, వాళ్లు రివాల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్జేడీపై మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలోని పిల్లల కోసం ఆర్జేడీ ఏం చేయాలనుకుంటుందో వారి ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కన్పిస్తున్నది. బిహార్లో పిల్లలు డాక్టర్లు అవ్వాలా? మన పిల్లలను క్రూరులుగా మారాలని కోరుకునే వారిని మనం గెలిపిస్తామా?’ అని మోదీ ప్రశ్నించారు.
పిల్లలు స్టార్టప్స్ గురించి కలలు కనాలి
జంగిల్ రాజ్ అంటే క్రూరత్వం, అవినీతి, చెడ్డ పాలన అని ప్రధాని మోదీ తెలిపారు. ఆర్జేడీ పాలకులకు నైతికత లేదని, వారికి దుర్మార్గ రాజ్యం కావాలని అన్నారు. వాళ్ల సొంత పిల్లలు మంత్రులు కావాలని, మిగతా పిల్లలు మాత్రం దోపిడీదారులుగా ఉండాలని కోరుకుంటారని మండిపడ్డారు. అలాంటి సర్కారు మనకొద్దని, మరొక్కసారి ఎన్డీయే సర్కారే రావాలి అని నినదించారు. బిహార్ పిల్లలు ఇక ‘హ్యాండ్సప్’ నాయకుల కోసం కాకుండా స్టార్టప్ల గురించి కలలు కనాలని పిలుపునిచ్చారు.
ఆర్జేడీ, కాంగ్రెస్లకు ఇండస్ట్రీలో ఏ,బీ,సీ,డీలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు ఎలా మూసేయాలో మాత్రమే వారికి తెలుసని విమర్శించారు. జంగిల్ రాజ్ 15 ఏండ్ల పాలనలో బిహార్లో ఓ పెద్ద హాస్పిటల్గానీ, మెడికల్ కాలేజీగానీ ఏర్పాటు చేయలేదన్నారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వచ్చాకే.. బిహార్ పునర్నిర్మాణం ప్రారంభమైందని, ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఫేజ్ –1 ఓటింగ్ తర్వాత జంగిల్ రాజ్ లీడర్లకు 65 వోల్ట్ల షాక్ తగిలిందని అన్నారు.
