- 2-0తో సిరీస్ క్లీన్స్వీప్
- 238 రన్స్ భారీ తేడాతో శ్రీలంక చిత్తు
బెంగళూరు: ఫార్మాట్ ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా.. టెస్ట్ మ్యాచ్ ఎలాంటిదైనా... స్వదేశంలో గెలుపు మాత్రం ఇండియాదే. ఈ విజయ సూత్రాన్ని టీమిండియా మరోసారి రిపీట్ చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్లోనూ ఇండియా 238 రన్స్ భారీ తేడాతో శ్రీలంకపై గెలిచి రెండు మ్యాచ్ల సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. 447 రన్స్ టార్గెట్ను ఛేదించే క్రమంలో 28/1 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు సోమవారం బరిలోకి దిగిన శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్లో 59.3 ఓవర్లలో 208 రన్స్కే ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నె (107) సెంచరీతో పోరాడగా, కుశాల్ మెండిస్ (54) ఫర్వాలేదనిపించాడు. అశ్విన్ 4, బుమ్రా 3 వికెట్లు తీశారు. శ్రేయస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రిషబ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఈ సిరీస్ విక్టరీతో 24 పాయింట్లు సాధించిన రోహిత్సేన (77 పాయింట్లు) డబ్ల్యూటీసీ టేబుల్లో నాలుగో ప్లేస్లో నిలిచింది. స్వదేశంలో ఆడిన మూడు డే నైట్ టెస్ట్లోనూ ఇండియానే గెలవడం విశేషం.
కరుణరత్నె సెంచరీ..
10 రన్స్ వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కరుణరత్నె పోరాటస్ఫూర్తి చూపెట్టాడు. మెండిస్తో కలిసి నిలకడగా ఆడాడు. అయితే ఎండ పెరిగే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై అశ్విన్, జడేజా టర్న్ను ఎదుర్కోవడం వీళ్లకు సవాల్గా మారింది. అయినప్పటికీ మెండిస్ ఫ్రంట్, బ్యాక్ఫుట్, ఫుల్ షాట్స్తో బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. రెండో ఎండ్లో కరుణరత్నె కూడా ఇదే ప్లాన్ను అనుసరించినా, మెండిస్ వేగంగా భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో జడేజా (1/48) బాల్కు సింగిల్ తీసి 57 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ కొద్దిసేపటికే అశ్విన్ (20వ ఓవర్) ఫ్లైట్ బాల్ను ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. ఫలితంగా సెకండ్ వికెట్కు 96 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. తర్వాతి ఓవర్లోనే మాథ్యూస్ (1)ను జడేజా వెనక్కి పంపాడు. ఆరు ఓవర్ల తర్వాత అశ్విన్.. డిసిల్వా (4)ను పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో డిక్వెలా (12)తో కలిసి కరుణరత్నె నిలకడగా ఆడాడు. అక్షర్ (2/37) బౌలింగ్లో సింగిల్తో ఫిఫ్టీ పూర్తి చేశాడు. మొత్తానికి టీ బ్రేక్ వరకు లంక 151/4 స్కోరు చేసింది. సెకండ్ సెషన్లో 20.3 ఓవర్లు మాత్రమే ఆడిన లంక 57 రన్స్ జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఐదో వికెట్కు 55 రన్స్ జత చేసి డిక్వెలా ఔటైన తర్వాత లోయర్ ఆర్డర్ నుంచి కరుణరత్నెకు సహకారం కరువైంది. దీంతో ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్న కెప్టెన్ వేగంగా ఆడుతూ సెంచరీని కంప్లీట్ చేశాడు. అసలంక (5), ఎంబుల్డెనియా (2), లక్మల్ (1), ఫెర్నాండో (2), జయవిక్రమ (0 నాటౌట్) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 252 ఆలౌట్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109ఆలౌట్; ఇండియా రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్, శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208 ఆలౌట్ (కరుణరత్నె 107, కుశాల్ మెండిస్ 54, అశ్విన్ 4/55, బుమ్రా 3/23).
స్టెయిన్ను దాటిన అశ్విన్
టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ను దాటిన అశ్విన్ ఎనిమిదో ప్లేస్కు చేరుకున్నాడు. స్టెయిన్ 93 మ్యాచ్ల్లో 439 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 86 టెస్టుల్లోనే 440 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ లిస్ట్లో మురళీధరన్ 800 వికెట్లతో టాప్లో ఉన్నాడు. స్వదేశంలో వరుసగా 15 టెస్టు సిరీస్లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. డిసెంబర్ 2012లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత ఆడిన అన్ని సిరీస్ల్లోనూ నెగ్గింది. ఆస్ట్రేలియా వరుసగా10 సిరీస్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫుల్టైమ్ కెప్టెన్గా రోహిత్ శర్మ సారథ్యంలో ఇప్పటిదాకా పోటీపడ్డ ఐదు సిరీస్లనూ ఇండియా క్లీన్స్వీప్ చేసింది. శ్రీలంకతో టెస్టు, టీ20లు, వెస్టిండీస్తో వన్డే, టీ20లతో పాటు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో అన్ని మ్యాచ్ల్లో ఇండియా గెలిచింది.