సైబర్​ నేరాల్లో ఇండియా థర్డ్ ప్లేస్

సైబర్​ నేరాల్లో ఇండియా థర్డ్ ప్లేస్
  • టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో బ్రిటన్‌‌‌‌..
  • రెండో స్థానంలో కెనడా
  • ఎఫ్‌‌‌‌బీఐ ‘ఇంటర్నెట్‌‌‌‌ క్రైమ్‌‌‌‌
  • రిపోర్టు 2019’ విడుదల

దేశంలో ఇంటర్నెట్‌‌‌‌ నేరాలు ఎక్కువైతున్నయ్‌‌‌‌. నకిలీ వెబ్‌‌‌‌సైట్లతో, ఈ మెయిల్‌‌‌‌ ఫిషింగ్‌‌‌‌తో, ఫోన్‌‌‌‌లకు మెసేజ్‌‌‌‌లు పంపి దోచుకుంటున్న కేసులు మస్తుగైతున్నయ్‌‌‌‌. ఇట్లాంటి సైబర్‌‌‌‌ నేరాల్లో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో నిలిచింది. అమెరికాను పక్కనబెడితే మిగతా దేశాల్లో ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో బ్రిటన్‌‌‌‌, రెండో ప్లేస్‌‌‌‌లో కెనడా ఉన్నాయి. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్‌‌‌‌ బ్యూరో ఆఫ్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌బీఐ) ఈ విషయం వెల్లడించింది. సైబర్‌‌‌‌ నేరాలకు సంబంధించి ‘ఇంటర్నెట్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ రిపోర్టు 2019’ను విడుదల చేసింది. 93,796 సైబర్ నేరాలతో బ్రిటన్‌‌‌‌ టాప్‌‌‌‌లో ఉందని.. 3,721 నేరాలతో కెనడా రెండు.. 2,901 నేరాలతో ఇండియా మూడో స్థానంలో ఉన్నాయని నివేదికలో పేర్కొంది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2018లో దేశంలో 27,248 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2019లో 33,152కు పెరిగాయి. తెలంగాణలో 2018లో 1,205 కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో 4.6 లక్షలు

అమెరికాలో గతేడాది 4,67,361 సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదయ్యాయని, వాటి ద్వారా సుమారు రూ. 25 వేల కోట్ల నష్టం జరిగిందని ఎఫ్‌‌‌‌బీఐ పేర్కొంది. ఈ మెయిల్‌‌‌‌ ద్వారానే ఎక్కువ సైబర్‌‌‌‌ నేరాలు జరుగుతున్నాయని.. టెక్స్ట్‌‌‌‌ మెసేజ్‌‌‌‌లు, ఫేక్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్ల ద్వారా కూడా డబ్బులు దోచుకుంటున్నారని వివరించింది. 2019లో కొత్త రకం నేరాలైతే బయటపడలేదని, కానీ పాత పద్ధతులను కొత్త కొత్తగా వాడుతున్నారని చెప్పింది.

2019 రిపోర్టు విడుదల

ఎఫ్ బీఐలోని ‘ఇంటర్నెట్ క్రైమ్ కంప్లైంట్ సెంటర్’ 2019కి సంబంధించి నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నేరాల బారినపడుతున్న టాప్ 20 దేశాల లిస్టును రెడీ చేసింది. నేరాలు ఎలా చేస్తున్నారు, వాటి వల్ల ఎంత నష్టం జరిగింది, ఏ ఏడాది ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలను అందులో పేర్కొంది.

కాస్త జాగ్రత్త: ఎఫ్‌‌‌‌బీఐ

బ్యాంకులు, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్సాక్షన్లకు ఎట్లైతే రెండు అంచెల్లో చెకింగ్‌‌‌‌ ఉంటుందో మనం కూడా దాన్ని అప్లై చేయాలని ఎఫ్‌‌‌‌బీఐ ప్రతినిధి డోనా గ్రెగరీ చెప్పారు. ఫేక్‌‌‌‌ మెసేజ్‌‌‌‌లు, ఫోన్‌‌‌‌కాల్స్‌‌‌‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. తెలియని వాళ్ల నుంచి వచ్చే మెసేజ్‌‌‌‌లలో ఉండే లింకులను, ఈ మెయిల్‌‌‌‌లో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవొద్దని సూచించారు.