లండన్: పవర్ఫుల్ బౌలింగ్, నిర్భయమైన బ్యాటింగ్తో చెలరేగి టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగే తొలి పోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టీ20ల్లో హై–రిస్క్ ఆటతో సక్సెస్ సాధించిన రోహిత్సేన.. 50 ఓవర్లలోనూ అదే దూకుడు చూపెట్టాలని అనుకుంటోంది. మరోవైపు 2019 వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లండ్ తమ విధ్వంసకర బ్యాటింగ్తో ఈ ఫార్మాట్ ఆటనే మార్చేసింది. ఇప్పుడు ఇండియా కూడా అదే బాటలో నడవాలని చూస్తోంది. టీ20 వరల్డ్కప్ను ముందు ఈ ఫార్మాట్లో టీమిండియా ఎదుర్కొనే బలమైన ప్రత్యర్థి ఇంగ్లండే.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ సన్నాహాల్లో ఈ సిరీస్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ జట్టు దీన్ని లైట్ తీసుకోవడం లేదు. తమకు అన్ని సిరీస్లు ముఖ్యమే అని కెప్టెన్ రోహిత్ స్పష్టం చేశాడు. ఇక, కేవలం ఈ ఫార్మాట్లో ఆడుతున్న శిఖర్ ధవన్ వెస్టిండీస్ టూర్లో వన్డే టీమ్ను నడిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు జతగా ఇంగ్లండ్పై జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక, ఈ సిరీస్తో అయినా ఫామ్ అందుకుంటాడని ఆశించిన విరాట్ కోహ్లీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. మూడో టీ20 సందర్భంగా అతనికి గజ్జల్లో గాయం అయింది. తీవ్రత తెలియకపోయినప్పటికీ తొలి మ్యాచ్కు అతను దూరం అయ్యే చాన్సుంది. అదే జరిగితే ఇషాన్ కిషన్ వన్డౌన్ బ్యాటర్గా తుది జట్టులోకి రానున్నాడు. ఇంగ్లండ్తో మూడో టీ20లో అద్భుత సెంచరీతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. బ్యాటింగ్పై ఎక్కువగా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎనిమిదో నంబర్లో పేసర్ ప్రసిధ్ కృష్ణ బదులు శార్దూల్ ఠాకూర్కే చాన్స్ రావొచ్చు. పేస్, స్పిన్ ఆల్రౌండర్లుగా హార్దిక్, జడేజా బరిలోకి దిగనుండగా షమీతో కలిసి బుమ్రా పేస్ను నడిపించనున్నాడు.
ఇంగ్లండ్ కసిగా..
మోర్గాన్ నుంచి లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ పగ్గాలు అందుకున్న జోస్ బట్లర్కు ఇదే తొలి వన్డే సిరీస్. టీ20ల్లో కెప్టెన్గా, బ్యాటర్గా నిరాశ పరిచిన నేపథ్యంలో తమకు అచ్చొచ్చిన ఈ ఫార్మాట్లో చెలరేగాలని బట్లర్ భావిస్తున్నాడు. టీ20ల్లో ఓటమికి వన్డేల్లో బదులు తీర్చుకోవాలని ఆతిథ్య జట్టు కసిగా ఉంది. వన్డేల్లో ఇంగ్లండ్ చాలా దూకుడుగా ఆడుతోంది. ఈ మధ్యే వరల్డ్ రికార్డు స్కోరు (ఐర్లాండ్పై 498) బద్దలు కొట్టింది. రాయ్, బట్లర్, లివింగ్స్టోన్ వంటి హార్డ్ హిట్టర్లతో ఆ జట్టు నిలకడగా 400 ప్లస్ స్కోర్లు చేస్తోంది కాబట్టి ఇండియా బౌలర్లకు సవాల్ తప్పదు. పైగా, టెస్టుల్లో భీకర ఫామ్ చూపెట్టిన రూట్, బెయిర్స్టోతో పాటు బెన్ స్టోక్స్ తిరిగి రావడంతో ఆ జట్టు బలం మరింత పెరిగింది.
తుది జట్లు (అంచనా):
ఇండియా: రోహిత్ (కెప్టెన్), ధవన్, ఇషాన్/ కోహ్లీ, సూర్యకుమార్, పంత్ (కీపర్), హార్దిక్, జడేజా, శార్దూల్/ప్రసిధ్, షమీ, చహల్, బుమ్రా.
ఇంగ్లండ్: రాయ్, బెయిర్స్టో, రూట్, లివింగ్స్టోన్, స్టోక్స్, బట్లర్ (కీపర్, కెప్టెన్), మొయిన్ అలీ, విల్లీ, బ్రైడన్ కార్స్, ఓవర్టన్/పార్కిన్సన్, రీస్ టాప్లీ.