ఫ్లైట్ ఎక్కాలంటే ఇది ఉండాల్సిందే

ఫ్లైట్ ఎక్కాలంటే ఇది ఉండాల్సిందే

కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం విమానయాన సంస్థల్ని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్  నెగిటివ్  రిపోర్టులను తప్పనిసరి చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. వచ్చే వారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూఎస్, ఫ్రాన్స్, గ్రీస్,  ఇటలీ తదితర దేశాల్లో కోవిడ్-19 కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

కేంద్రం నిర్ణయం మేరకు విదేశాల నుండి వచ్చే  ప్రయాణికులు ముందుగా తమ కోవిడ్  నెగిటివ్  రిపోర్టును ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్లైట్ ల్యాండైన తర్వాత ఎయిర్ పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు. కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో పరిస్థితి మరింత దారణంగా మారే అవకాశముందన్న ప్రపంచ ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను ఆయన గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు మాస్క్, శానిటైజర్లు తప్పని సరిగా వాడేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.