బోపన్న జోడీకి మియామి టైటిల్‌

బోపన్న జోడీకి మియామి టైటిల్‌

మియామి : ఇండియా వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ.. మియామి ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్‌ బోపన్న–ఎబ్డెన్‌ 6–3 (3/7), 6–3, 10-–6తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్లు ఇవాన్‌ డుడిగ్‌ (క్రొయేషియా)–ఆస్టిన్‌ క్రాజిసెక్‌ (అమెరికా)పై గెలిచారు. హోరాహోరీగా సాగిన టైటిల్‌ ఫైట్‌లో బోపన్న జంటకు తొలి సెట్‌లో గట్టి పోటీ ఎదురైంది. డుడిగ్‌–క్రాజిసెక్‌ బలమైన సర్వీస్‌లతో చెలరేగారు.

దీంతో స్కోరు సమం కావడంతో టైబ్రేక్‌లో ప్రత్యర్థులు సెట్‌ను నెగ్గారు. కానీ రెండో సెట్‌ నుంచి బోపన్న–ఎబ్డెన్‌ వ్యూహాత్మకంగా ఆడారు. ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు బలమైన బేస్‌లైన్‌ గేమ్‌తో ఆకట్టుకున్నారు. రెండో గేమ్‌లో మూడుసార్లు డుడిగ్‌–క్రాజిసెక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచారు.

నిర్ణయాత్మక మూడో సెట్‌లో రెండు జంటలు పోటాపోటీగా తలపడినా చివర్లో వరుస పాయింట్లతో బోపన్న ద్వయం సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుంది. మ్యాచ్‌ మొత్తంలో బోపన్న–ఎబ్డెన్‌ 6 ఏస్‌లు, 6 డబుల్‌ ఫాల్ట్స్‌ చేశారు. క్రాజిసెక్‌ జోడీ 3 ఏస్‌లు, 3 డబుల్‌ ఫాల్ట్స్‌ చేసింది. ఆరు బ్రేక్‌ పాయింట్లతో బోపన్న జోడీ రెండింటిని కాచుకుంది.