బర్మింగ్హామ్ : వరుసగా మూడు రోజులు బ్యాటింగ్, బౌలింగ్తో చెలరేగిన టీమిండియా నాలుగో రోజు తడబడింది. బ్యాట్, బాల్తో నిరాశ పరిచి ఇంగ్లండ్తో ఐదో టెస్టులో పట్టు చేజార్చుకుంది. గెలుపు ఖాయం అనుకున్న మ్యాచ్లో ఓటమి ముంగిట నిలిచింది. ఇంకోవైపు అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసుకుంది. ఇండియా ఇచ్చిన 378 టార్గెట్ ఛేజింగ్లో నాలుగో రోజు, సోమవారం చివరకు 259/3 స్కోరుతో నిలిచింది. నాలుగో వికెట్కు 150 రన్స్ జోడించిన జో రూట్ (76 బ్యాటింగ్), బెయిర్ స్టో (72 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆ జట్టుకు మరో 119 పరుగులు అవసరం. ఇండియా నెగ్గాలంటే మరో 7 వికెట్లు పడగొట్టాలి. బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్లో ఇండియా గెలిచేలా లేదు. అంతకుముందు 125/3తో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో 245 స్కోరు వద్ద ఆలౌటైంది. పుజారా (66), రిషబ్ పంత్ (57) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ (4/33) 4 వికెట్లతో దెబ్బకొట్టాడు.
120 రన్స్కే ఏడు వికెట్లు ..
ఓవర్నైట్ స్కోరుకు మరో 120 రన్స్ మాత్రమే జోడించిన ఇండియా మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ను ఓవర్నైట్ బ్యాటర్లు పుజారా, పంత్ మెరుగ్గానే ప్రారంభించారు. అండర్సన్ బౌలింగ్లో పుజారా బ్యాక్ ఫుట్ పంచ్లతో వరుసగా రెండు బౌండ్రీలు కొట్టాడు. అయితే, భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన తను.. బ్రాడ్ వేసిన షార్ట్, వైడ్ బాల్ను కట్ చేయబోయి వికెట్ పారేసుకున్నాడు. దాంతో నాలుగో వికెట్కు 78 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత ఇండియా వరుసగా వికెట్లు చేజార్చుకొని ఆత్మరక్షణలో పడింది. పంత్కు తోడైన శ్రేయస్ (19) ఒకటి రెండు బౌండ్రీలతో దూకుడుగా కనిపించినప్పటికీ ఇంగ్లండ్ షార్ట్ బాల్ ట్రాప్లో చిక్కుకున్నాడు. ఇక, 76 బాల్స్లో ఫిఫ్టీ మార్కు దాటిన వెంటనే పంత్... స్పిన్నర్ లీచ్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్కు ప్రయత్నించి రూట్కు చిక్కాడు. కాసేటికే శార్దూల్ (4) వెనుదిరగడంతో ఇండియా 207/8 స్కోరుతో నిలిచింది. చివర్లో షమీ (13), బుమ్రా (7) సపోర్ట్తో జడేజా (23) స్కోరు 240 దాటించాడు. వరుస ఓవర్లలో జడ్డూ, బుమ్రాను ఔట్ చేసిన స్టోక్స్ ఇండియా ఇన్నింగ్స్ను ముగించాడు.
వన్డే స్టయిల్లో ఛేజింగ్
భారీ టార్గెట్ ఛేజింగ్లో ఇంగ్లండ్ వన్డే వేగంతో ఆడింది. ఓపెన్లర్లు లీస్ (56), క్రాలీ (46) ఆరంభం నుంచే ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా లీస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. షమీ, బుమ్రా, సిరాజ్తో పాటు జడేజా బౌలింగ్లో వరుసగా బౌండ్రీలు కొడుతూ 44 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. క్రాలీ కూడా బౌండ్రీలతో జోరందుకున్నాడు. అయితే, టీ బ్రేక్ ముందు క్రాలీని బౌల్డ్ చేసిన బుమ్రా తొలి వికెట్కు 107 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఆపై, మూడో సెషన్ తొలి బాల్కే ఒలీ పోప్ (0)ను బుమ్రా డకౌట్ చేయగా.. తర్వాతి ఓవర్లోనే లీస్ రనౌట్ కావడంతో ఇండియా ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. 109/3తో ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్ను ఫామ్లో ఉన్న రూట్, జానీ బెయిర్స్టో ఆదుకున్నారు. రూట్ వికెట్ కోసం వరుస ఓవర్లలో ఇండియా రెండు రివ్యూలను వేస్ట్ చేసింది. బెయిర్స్టో 24 రన్స్ వద్ద సిరాజ్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను విహారి వదిలేశాడు. ఈ చాన్స్ను తను సద్వినియోగం చేసుకున్నాడు. బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా రూట్, జానీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. క్లాసిక్ షాట్లు కొడుతూ ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. వీళ్లను విడదీయడానికి బుమ్రా, ఇతర బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్; ఇండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ (పుజారా 66, పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 378): 57 ఓవర్లలో 259/3 (రూట్ 76 బ్యాటింగ్, బెయిర్స్టో 72 బ్యాటింగ్, బుమ్రా 2/53)