- లెక్క సరిచేయడంపై కివీస్ దృష్టి
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో లైవ్
రాజ్కోట్: ఓవైపు కింగ్ కోహ్లీ సూపర్ ఫామ్.. మరోవైపు కీలక ప్లేయర్లకు గాయాలు.. ఈ నేపథ్యంలో టీమిండియా.. న్యూజిలాండ్తో రెండో వన్డేకు రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్లో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రతీ మ్యాచ్లో ఏదో ఓ ప్లేయర్ గాయంతో సిరీస్కు దూరమవుతుండటంతో ఇండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. తొలి రోజు ప్రాక్టీస్ తర్వాత రిషబ్ పంత్, తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. దీంతో టీ20 వరల్డ్ కప్కు నెల రోజుల సమయమే మిగిలి ఉండటంతో రాబోయే మ్యాచ్ల్లో గాయాల బెడద పెరగొద్దని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి వన్డేలో జోరు చూపెట్టిన టీమిండియా అదే ఫామ్ను కొనసాగించాలని భావిస్తోంది. అయితే తుది జట్టు ఎంపికపై కొద్దిగా కసరత్తు ఎక్కువ చేయాల్సి వస్తోంది. పంత్, సుందర్ ప్లేస్లో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్, ఆయుష్ బదోనీలకు చాన్స్ ఇవ్వడంపై సందిగ్ధత నెలకొంది. బహుళ నైపుణ్యం ఉన్న ప్లేయర్లకే తుది జట్టులో అవకాశం కల్పించాలని చీఫ్ కోచ్ గంభీర్ ఆలోచిస్తున్నాడు.
దాంతో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫైనల్ ఎలెవన్లోకి రావొచ్చు. ఒకవేళ స్పెషలిస్ట్ బ్యాటర్ కావాలనుకుంటే మాత్రం ధ్రువ్ జురెల్ను తీసుకోవచ్చు. సీనియర్లు రోహిత్ ఫామ్లోకి రావాల్సి ఉండగా, కోహ్లీకి తిరుగులేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాడిలో పడటం ఇండియా బ్యాటింగ్ బలాన్ని అమాంతం పెంచేసింది. కేఎల్ రాహుల్కు ఎలాంటి ఇబ్బంది లేదు. బౌలింగ్లో ప్రసిధ్ కృష్ణ ప్లేస్లో అర్ష్దీప్ సింగ్ రానున్నాడు. సిరాజ్, హర్షిత్ రాణా మిగతా పేసర్లు. అయితే స్పిన్నర్లు జడేజా, కుల్దీప్లో మెరుగుదల కనిపించాల్సి ఉంది. ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో వైట్ బాల్ సెటప్లో గాయాలు పెరగొద్దని నిర్ణయాలు కూడా ఆచితూచి తీసుకుంటున్నారు. ఎందుకంటే వన్డేలతో పోలిస్తే టీ20 టీమ్ సెటప్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే ఆల్రౌండర్ తిలక్ వర్మ గాయంతో కివీస్తో జరిగే తొలి మూడు వన్డేలకు అందుబాటులో ఉండటం కష్టంగా మారింది.
‘మిడిల్’పై దృష్టి
తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోవడంతో కివీస్ ఈ మ్యాచ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓపెనర్లు కాన్వే, నికోల్స్ ఇచ్చిన శుభారంభాన్ని మిడిలార్డర్ ఉపయోగించుకోలేకపోయింది. దాంతో మిడిల్ బలోపేతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే, కెప్టెన్ బ్రేస్వెల్ బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం ఉంది. డారిల్ మిచెల్, క్రిస్టియన్ క్లార్క్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్లో జెమీసన్ ప్రభావం చూపిస్తున్నా.. మిగతా బౌలర్ల నుంచి అనుకున్నంత సహకారం దక్కలేదు. జాక్ ఫోక్స్, క్లార్క్, ఫిలిప్స్ వికెట్లు తీయాల్సి ఉంది. లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్లో ప్రభావం చూపిస్తాడని అంచనా వేస్తున్నారు.
జట్లు (అంచనా)
ఇండియా: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ / ఆయుష్ బదోనీ, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, సిరాజ్.
న్యూజిలాండ్: మైకేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), డేవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, మిచెల్ హే, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జెమీసన్, జాక్ ఫోక్స్, ఆదిత్య అశోక్ / జైడెన్ లెనాక్స్.
పిచ్, వాతావరణం
మంచు ప్రభావం పెద్దగా లేదు. వాతావరణం చల్లగా ఉంది. పిచ్పై వేగం ఎక్కువగా ఉంది. ముందు బ్యాటింగ్ చేస్తే ఇన్నింగ్స్ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలి. ఓపిక పడితే రన్స్ ఈజీగా వస్తాయి. వర్షం ముప్పు లేదు.
34 అత్యంత వేగంగా
3 వేల రన్స్ చేసిన తొలి బ్యాటర్గా నిలిచేందుకు శ్రేయస్ (68 ఇన్నింగ్స్)కు కావాల్సిన రన్స్. ధవన్ (72), కోహ్లీ (75)ని అధిగమిస్తాడు. ఓవరాల్గా నాలుగో
బ్యాటర్గా నిలుస్తాడు.
