
జింబాబ్వేపై జరుగుతున్న తొలి వన్డేలోనే భారత్ శుభారంభం చేసింది. ఓపెనర్లు రాణించడంతో ఒక వికెట్ పోకుండా నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించింది. ధావన్, శుభమన్ గిల్ లు హాఫ్ సెంచరీ కదం తొక్కారు. దీంతో 30.5 ఓవర్లలో 192 పరుగులు చేసి పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. వీరిద్దరిని అవుట్ చేయడానికి జింబాబ్వే బౌలర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బౌలర్లను కెప్టెన్ మార్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1–0 తేడాతో భారత్ అధిక్యం కనబరిచింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుందనే అంచనాతో ఫీల్డింగ్ తీసుకోవడం జరిగిందని కెప్టెన్ రాహుల్ వెల్లడించాడు. అతను చెప్పినట్లుగానే బౌలర్లకు పిచ్ సహకరించింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోయారు. పరుగులు సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
జింబాబ్వే జట్టులో కెప్టెన్ రెగిస్ చకబ్వా (35), బ్రాడ్ ఇవాన్స్ (33 నాటౌట్) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కేవలం 40.3 ఓవర్లలో జింబాబ్వే జట్టు 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన టీమిండియా జట్టు.. ఎలాంటి తడబాటుకు గురి కాలేదు. ఓపెనర్స్... ధావన్, శుభమన్ గిల్ లు జింబాబ్వే బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. స్కోరు బోర్డును పరుగెత్తించారు. వీరిని అవుట్ చేయడానికి బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. కానీ.. వారికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలో... 76 బంతులను ఎదుర్కొన్న ధావన్.. 6 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. ఇతనికి చక్కటి సహకారం అందించిన గిల్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 19.4 ఓవర్లలో 104 పరుగులు చేసి లక్ష్య చేధనకు మార్గం సుగమం చేసింది. 30.5 ఓవర్లలో 192 పరుగులు చేసి విజయం సాధించింది. ధావన్ 81, గిల్ 82 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో దీపక్ చహార్, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్ చెలరేగిపోయారు. వీరు చెరో మూడు వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ తీశారు.