- 17 రన్స్ తేడాతో ఇంగ్లండ్ గెలుపు
- సూర్యకుమార్ సెంచరీ వృథా
నాటింగ్హామ్: భారీ టార్గెట్ ఛేజింగ్లో టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (55 బాల్స్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117) సెంచరీతో చెలరేగినా.. మిగతా బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో మూడో టీ20లో ఇండియా విజయాన్ని చేజార్చుకుంది. ఆదివారం జరిగిన ఈ పోరులో 17 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ ఊరట దక్కించుకుంది. హోరాహోరీ మ్యాచ్లో టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 స్కోరు చేసింది. డేవిడ్ మలన్ (39 బాల్స్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 77) దంచికొట్టగా.. లివింగ్స్టోన్ (29 బాల్స్లో 4 సిక్సర్లతో 42 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఇండియా పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ లేకపోవడంతో ఆరంభం నుంచే దూకుడు చూపెట్టిన హోమ్ టీమ్ ఇన్నింగ్స్ లో రాయ్ (27), బట్లర్ (18), బ్రూక్ (19) ఓ మాదిరిగా ఆడారు. ఇండియా బౌలర్లలో రవి బిష్నోయ్ (2/30), హర్షల్ (2/35) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్లో ఇండియా 198/9 మాత్రమే చేయగలిగింది. మూడు కీలక వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లీ (3/22) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవగా.. భువనేశ్వర్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఇండియా 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.
సూర్య ప్రతాపం
ఛేజింగ్లో 31 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి ఇండియా డీలా పడ్డది. టాప్లీ దెబ్బకు ఓపెనర్లు రోహిత్ (11), పంత్ (1) వెనుదిరగ్గా.. కోహ్లీ (11) మళ్లీ ఫెయిలవడంతో ఇండియా చిత్తుగా ఓడిపోయేలా కనిపించింది. ఇలాంటి టైమ్లో సూర్య అనూహ్యంగా చెలరేగాడు. విల్లీ వేసిన ఏడో ఓవర్లో 4,6తో తన ప్రతాపం మొదలు పెట్టాడు. అవతలి ఎండ్లో శ్రేయస్ (28) స్ట్రయిక్ రొటేట్ చేయగా.. సూర్య ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కండ్లు చెదిరే షాట్లతో గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొట్టి ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. స్కూప్ షాట్తో పాయింట్ మీదుగా కొట్టిన సిక్సర్ మ్యాచ్కే హైలైట్. ఈ క్రమంలో 32 బాల్స్లో ఫిఫ్టీ దాటిన అతను మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. అతని దెబ్బకు 15వ ఓవర్లోనే స్కోరు 150 దాటింది. తర్వాతి ఓవర్లలో అయ్యర్, కార్తీక్ (6) ఔటవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. గ్లీసన్ వేసిన 18వ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన జడేజా (7) వెంటనే ఔటయ్యాడు. చివరి12 బాల్స్లో జట్టుకు 41 రన్స్గా అవసరం అవగా.. అలీ వేసిన 19వ ఓవర్లో సూర్య 4, 6, 4 కొట్టడంతో విజయంపై ఆశలు రేగాయి. కానీ, మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఐదో బాల్కు తను ఔటడంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమైంది. మ్యాచ్లో ఇండియా ఓడినా కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో సూర్య జట్టులో ప్లేస్ను సుస్థిరం చేసుకున్నట్టే.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 215/7 (మలన్ 77,
లివింగ్స్టోన్ 42 నాటౌట్, బిష్నోయ్ 2/30).
ఇండియా: 20 ఓవర్లలో 198/9 (సూర్య 117, టాప్లీ 3/22)