
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్ కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెల్జియం పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల ద్వారా రెచ్చగొడితే పాకిస్తాన్పై భారత్ మరింత లోపలికెళ్లి దాడి చేస్తోందని హెచ్చరించారు. పహల్గామ్ దాడి వంటి అనాగరిక చర్యలకు పాల్పడితే ఉగ్రవాద సంస్థలు, వారి నాయకులపై ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఎంతో మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ వే బహిరంగంగా శిక్షణ ఇస్తుందని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్పై దాడులు చేయిస్తోందని దాయాది దేశాన్ని దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. భారత్పై దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే వదలమని.. వాళ్లు పాకిస్థాన్ లోపల దాక్కున్నా అక్కడికెళ్లి కూడా దాడి చేస్తామని తేల్చి చెప్పారు. భారత్పై దాడులకు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా మార్చుకుందని.. ఇదే ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలకు దారి తీస్తోందన్నారు. ఇప్పటికే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోందన్నారు.
ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన దాడుల్లో భారతదేశ క్షిపణులు పాకిస్తాన్కు తీవ్ర నష్టం కలిగించాయన్నారు. సైనిక దాడుల్లో ధ్వంసమైన పాక్ విమానాలు, మిస్సైళ్లే ఇందుకు నిదర్శనమన్నారు. గత్యంతరం లేక కాల్పులు విరమణ అంటూ పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపారు. సైనిక దాడుల్లో భారత్ కు జరిగిన నష్టం గురించి సంబంధిత అధికారులకే పూర్తిగా తెలుసని.. ఈ విషయం గురించి తనకు తెలియదన్నారు.