న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) అప్రమత్తమైంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట చైనా కదలికలపై నిఘా పెట్టేందుకు సుఖోయ్–30 ఫైటర్ జెట్స్ను రంగంలోకి దించింది. ఇండియన్ ఆర్మీతో కలిసి పెట్రోలింగ్ చేస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బార్డర్ రీజియన్లో ఫైటర్ జెట్స్ ఫ్రీక్వెన్సీ పెంచింది. ఘర్షణకు ముందు నుంచే సరిహద్దులో గస్తీ ముమ్మరం చేసింది.
సాధారణం కంటే ఫైటర్ జెట్స్ నిఘా 2 నుంచి 3 రెట్లు పెంచినట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఎల్ఏసీ దగ్గర్లో చైనా కూడా తన యాక్టివిటీ పెంచిందన్నారు. ఫైటర్ జెట్స్తో ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నదని తెలిపారు. చైనా ఆర్మీకి దీటుగా బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తేజ్పూర్తో పాటు ఈస్టర్న్ ఏరియాలో ఐఎఎఫ్ బలం పెంచామన్నారు. పశ్చిమ బెంగాల్లోని హసిమారా ఎయిర్ బేస్లో రాఫెల్ జెట్ల స్క్వాడ్రన్ ఉందని, అవసరమైతే వాటిని కూడా బార్డర్కు తరలిస్తామని ప్రకటించారు. తవాంగ్ సెక్టార్లోని యాంగ్ట్సే ఏరియాలో డ్రోన్లతో చైనా గస్తీ కాస్తోందన్నారు. డిసెంబర్ 9న జరిగిన ఘర్షణపై రివ్యూ చేసినట్టు ఎయిర్ స్టాఫ్ చీఫ్ వీఆర్ చౌదరీ తెలిపారు.