
ట్యాంకు కిల్లర్లు ఇండియన్ ఆర్మీ చేతికి వచ్చేశాయి. మన మీదకు దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ ట్యాంకుల భరతం పట్టే ఇజ్రాయెలీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ స్పైక్ ఆర్మీలోకి చేరాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) సొంత టెక్నాలజీతో తయారు చేస్తున్న మ్యాన్పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు (ఎంపీఏటీజీఎం) లేట్ అయ్యే అవకాశాలుండడంతో, అవి అందుబాటులోకి వచ్చే వరకు ఇజ్రాయెల్ స్పైక్లను వాడాలని ఆర్మీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పుల్వామా దాడి ఘటన, బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ వంటి వాటితో ఆర్మీ స్పైక్ మిసైళ్లకు ఆర్డరిచ్చింది. అందులో భాగంగా తొలి దశలో 210 మిసైళ్లు, కొన్ని లాంచర్లు పది రోజుల క్రితం ఆర్మీ చేతికి వచ్చాయని సైనిక అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బార్డర్లోని పరిస్థితుల దృష్ట్యా ఆర్మీ వైస్ చీఫ్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ను (అత్యవసర ఆయుధ కొనుగోలు అధికారం) ఉపయోగించి స్పైక్ మిసైళ్లను కొన్నట్టు చెప్పారు. వీటి కోసం ₹280 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను స్పైక్ మిసైళ్లు ఈజీగా ఛేదించగలవు. వచ్చే ఏడాది కల్లా డీఆర్డీవో మిసైళ్లు రెడీ కాకపోతే మరిన్ని స్పైక్ మిసైళ్లకు ఆర్డర్ ఇస్తామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. డీఆర్డీవో మాత్రం వచ్చే ఏడాది కల్లా ఎంపీఏటీజీఎం యూజర్ ట్రయల్స్ చేస్తామని అంటోంది. ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్స్, అడ్వాన్స్డ్ ఏవియోనిక్స్తో ఈ మిసైళ్లు ట్యాంకులను నాశనం చేస్తాయని చెబుతోంది. 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని అంటోంది. ప్రస్తుతం ఆర్మీ దగ్గర ఉన్న మిలాన్ 2టీ (2 కిలోమీటర్ల రేంజ్), కోంకర్స్ (4 కిలోమీటర్ల రేంజ్) యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు రాత్రిపూట పనిచేయలేవు. ఈ మిసైళ్లను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. రాత్రి పూట పనిచేయకపోవడం వల్ల కొత్త వాటిని ఆర్మీ తీసుకుంటోంది.