ఒలింపిక్స్ లో 41ఏళ్ల తర్వాత భారత్ విక్టరీ

  ఒలింపిక్స్ లో 41ఏళ్ల తర్వాత భారత్ విక్టరీ

క్షణం క్షణం ఉత్కంఠ... పోటా పోటీగా గోల్స్... ఒలింపిక్స్ మెన్స్ హాకీలో కాంస్యం కోసం జరిగిన మ్యాచులో అదరగొట్టింది టీం ఇండియా. జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో అద్భుతమైన విక్టరీ సాధించింది భారత్. ఆట ప్రారంభమైన మొదటి నిమిషానికే గోల్ కొట్టి లీడ్ లోకి దూసుకెళ్లింది జర్మనీ. తొలి క్వార్టర్ లో ఇండియా నుంచి ఎలాంటి గోల్ నమోదు కాలేదు. రెండో క్వార్టర్ 17వ నిమిషంలో సిమ్రన్ జిత్ గోల్ కొట్టడంతో ఇండియా ఖాతా తెరిచింది. తర్వాత 24వ నిమిషంలో రెండో గోల్ తో జర్మనీ లీడ్ లోకి దూసుకెళ్లింది. 25వ నిమిషంలో జర్మనీ మరో గోల్ నమోదు చేయడంతో రెండు జట్ల మధ్య గోల్స్ తేడా 3-1కి పెరిగింది. ఐతే తర్వాత దూకుడు పెంచిన ఇండియన్ ప్లేయర్స్...28, 29 నిమిషాల్లో వరుస గోల్స్ కొట్టారు. 28వ నిమిషంలో హార్దిక్ సింగ్, 29వ నిమిషంలో హర్మన్ ప్రీత్ వరుసగా గోల్స్ కొట్టారు. దీంతో సగం ఆట ముగిసే సమయానికి రెండు జట్లు చెరో మూడు గోల్స్ తో సమంగా ఉన్నాయి.  

ఇక థర్డ్ క్వార్టర్ లోనూ అదే అటాకింగ్ కొనసాగించారు భారత ప్లేయర్లు. జర్మనిపై పూర్తి ఆధిపత్యం కొనసాగించారు. 31వ నిమిషంలో రూపిందర్ పాల్ గోల్ కొట్టడంతో ఇండియా లీడ్ లోకి వెళ్లింది. ఇక మ్యాచ్ 34వ నిమిషంలో సిమ్రాన్ జిత్ తన రెండో గోల్ నమోదు చేయడంతో రెండు జట్ల మధ్య గోల్స్ తేడా 3-5కు పెరిగింది. 43 నిమిషంలో జర్మనీకి మూడు పెనాల్టి కార్నర్ లు దక్కగా..అద్భుతమైన డిఫెన్స్ తో మూడు పెనాల్టీ కార్నర్లను సేవ్ చేశారు ఇండియన్ ప్లేయర్లు. మూడో క్వార్టర్ లో ఇండియా రెండు గోల్స్ కొట్టగా..జర్మనీ ఒక్క గోల్ కూడా కొట్టి లేకపోయింది. ఇక మూడో క్వార్టర్ లో ఒక్క గోల్ కూడా కొట్టని జర్మనీ...నాలుగో క్వార్టర్ 48వ నిమిషంలో పెనాల్టి కార్నర్ సాయంతో నాలుగో గోల్ కొట్టింది. దీంతో ఇండియా లీడ్ ను 4-5 తేడాకు తగ్గించింది. తర్వాత జర్మనీని మరో గోల్ కొట్టకుండా అడ్డుకోవడంతో ఇండియాకు కాంస్యం ఖరారైంది. దీంతో 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ హాకీ విభాగంలో భారత్ కు మెడల్ లభించింది.