న్యూఢిల్లీ: ఇండియన్ ఓషన్ రీజియన్ (ఐఓఆర్)లోని చైనీస్ ఫిషింగ్ ఓడలో చిక్కుకున్న 39 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ కాపాడింది. ఇండియాకు దాదాపు 900 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఐఓఆర్ ప్రాంతంలో ఓ చైనీస్ ఓడ మునిగిపోతుండటాన్ని అధికారులు బుధవారం గుర్తించారు. సముద్రంలో అనుమానాస్పదంగా ఓ గుర్తుతెలియని ఓడ తిరుగుతున్నట్లు గుర్తించారు.
దీంతో అలర్ట్ అయిన నేవీ సిబ్బంది ఆ ఓడ మునిగిపోతున్నట్లు గమనించింది. మునిగిపోతున్న ఓడలో సిబ్బందిని రక్షించాలంటూ చైనా నేవీ నుంచి ఇండియన్ నేవీకి సమాచారం అందింది. దీంతో వెంటనే మన నేవీ అధికారులు తన బలగాలతో ఓడలోని 39 మందిని కాపాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పీ8ఐ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టి, మునిగిపోతున్న ఓడను గుర్తించి, అందులో ఉన్న వారిని రక్షించామని నేవీ వెల్లడించింది. ఆ ఓడలో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్కు చెందిన దేశస్థులు ఉన్నారని ఇండియన్ నేవీ తన ట్విట్టర్లో పేర్కొంది.