
- పెరిగిన టైర్ల ఎగుమతులు..2024–25 లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఇండియా నుంచి టైర్ల ఎగుమతులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏడాది లెక్కన 9 శాతం పెరిగి రూ. 25,051 కోట్లకు చేరాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 23,073 కోట్లుగా ఉంది. గ్లోబల్గా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం, సప్లయ్ చెయిన్ సమస్యలు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధ్యమైందని ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏటీఎంఏ) తెలిపింది. టైర్ రంగం సంవత్సరానికి రూ. లక్ష కోట్ల టర్నోవర్, రూ. 25 వేల కోట్ల ఎగుమతులను నమోదు చేస్తోందని, ఇండియాలో అత్యధిక ఎగుమతి-, టర్నోవర్ నిష్పత్తి కలిగిన రంగాల్లో ఒకటిగా ఉందని వివరించింది.
కోవిడ్ తర్వాత ఈ రంగం బాగా కోలుకుంది. టైర్ల తయారీ కంపెనీలు గత 3-–4 సంవత్సరాల్లో రూ. 27 వేల కోట్లను గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాయని ఏటీఎంఏ చైర్మన్ అరుణ్ మామెన్ పేర్కొన్నారు. భారత టైర్లు 170 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఎక్కువగా అమెరికా ( ఎగుమతుల్లో 17 శాతం), జర్మనీ (6శాతం), బ్రెజిల్ (5శాతం), యూఏఈ (4శాతం), ఫ్రాన్స్ (4శాతం) దేశాలకు వెళుతున్నాయని అన్నారు. ఎగుమతి అవుతున్న టైర్లలో అగ్రికల్చరల్ సెక్టార్లో వాడే బండ్ల టైర్లు, ఆఫ్- ది- రోడ్ (ఓటీఆర్) టైర్ల వాటా 60శాతంగా ఉంది.
టైర్ల తయారీలో కీలకమైన నేచురల్ రబ్బర్ (ఎన్ఆర్) కొరత సమస్యగా మారింది. దేశీయంగా వీటి సప్లయ్ తక్కువగా ఉండడం వల్ల 40 శాతం ఎన్ఆర్ దిగుమతి చేసుకుంటున్నాం. గ్లోబల్గా టైర్ రంగంలో 60శాతం సింథటిక్ రబ్బర్ ఉపయోగిస్తుండగా, భారత్లో 60శాతం ఎన్ఆర్ వాడుతున్నారు. 2030 నాటికి ఎన్ఆర్ డిమాండ్ ఏడాదికి 20 లక్షల టన్నులు ఉంటుందని మామెన్ అంచనా వేశారు. దీనిని చేరుకునేందుకు రూ. 1,100 కోట్లతో 2 లక్షల హెక్టార్లలో ఎన్ఆర్ ప్లాంటేషన్ మొదలు పెట్టామని అన్నారు.