వెలుగు సక్సెస్ : ఆర్థికాభివృద్ధి సూచికలు

వెలుగు సక్సెస్ :  ఆర్థికాభివృద్ధి సూచికలు

సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికపరమైన ఉమ్మడి ఫలితమే ఆర్థికాభివృద్ధి. ఆర్థికకారకాలు, సంస్థలు, వ్యవస్థలు ఉమ్మడి ప్రగతి వ్యూహంతో ముందుకు సాగితేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థికవృద్ధి అనేది పరిణామాత్మక మార్పులను సూచిస్తే, ఆర్థికాభివృద్ధి అనేది పరిమాణాత్మక మార్పులతోపాటు గుణాత్మక మార్పులనూ సూచిస్తుంది. అయితే, ఒక దేశంలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే వాటిని వృద్ధ మాపనులు లేదా అభివృద్ధి సూచికలు అంటారు. 
 

జాతీయాదాయాన్ని పోల్చడం:

 ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జాతీయాదాయం అంటారు. జాతీయాదాయంలో పెరుగుదల సంభవిస్తే దానిని అభివృద్ధికి సూచికగా భావించవచ్చు. జాతీయాదాయంలో పెరుగుదల రెండు కారణాల వల్ల సంభవించవచ్చు. అవి. ఉత్పత్తిలో పెరుగుదల, ధరల స్థాయిలో పెరుగుదల. అయితే, నామ మాత్రపు జాతీయాదాయంలో పెరుగుదలను అభివృద్ధికి సూచికగా భావించడం సరికాదు. వాస్తవ జాతీయాదాయంలో పెరుగుదలను అభివృద్ధికి సూచికగా భావించడం ఉత్తమం. 

తలసరి ఆదాయం పోల్చడం:

 ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల సగటు వార్షిక ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయాదాయాన్ని జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం తెలుస్తుంది. జాతీయాదాయంలో పెరుగుదల కంటే తలసరి ఆదాయంలో పెరుగుదలను అభివృద్ధికి మేలైన సూచికగా భావించవచ్చు. తలసరి ఆదాయంలో పెరుగుదల అభివృద్ధికి సూచికే. కానీ ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం పెరిగితే అభివృద్ధికి సూచికగా భావించడం సమంజసం కాదు. అందుకే వాస్తవ తలసరి ఆదాయంలో పెరుగుదలను అభివృద్ధికి మేలైన సూచికగా భావించవచ్చు. 

సమగ్ర అభివృద్ధి సూచీ: ఈ సూచీని ఎవరెట్​ ఎ హెగెన్​ అనే ఆర్థికవేత్త 11 కొలమానాల ఆధారంగా రూపొందించాడు. అవి.. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య ఉద్యోగిత, కమ్యూనికేషన్స్​, మౌలిక పారిశ్రామిక వస్తువుల వినియోగం, మన్నిక గల వస్తువుల వినియోగం, పట్టణీకరణ, తలసరి ఆదాయం, సామాజిక వ్యక్తిగత సంక్షేమం, ఇతర సేవలు. 

పీక్యూఎల్​ఐ (భౌతిక నాణ్యత జీవన ప్రమాణ సూచీ): ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి జాతీయాదాయం, తలసరి ఆదాయాల కంటే పీక్యూఎల్​ఐ ద్వారా కచ్చితంగా లెక్కించవచ్చు. పీక్యూఎల్​ఐను ఆర్థిక వేత్త మోరిస్​ డేవిడ్​ మోరిస్​ రూపొందించాడు. 1979లో 23 దేశాల పీక్యూఎల్​ఐని లెక్కించి అభివృద్ధిని గణించాడు. పీక్యూఎల్​ఐని మూడు అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అవి.. ఆయు: ప్రమాణం (ఎల్​ఈఐ), శిశు మరణాల రేటు(ఐఎంఐ​), అక్షరాస్యత (బీఎల్​ఐ). పీక్యూఎల్​ఐ = ఎల్​ఈఐ + ఐఎంఐ + బీఎల్​ఐ/ 3 

మోరిస్​ ప్రకారం ఆయు: ప్రమాణం, అక్షరాస్యత అధికంగా ఉండి శిశు మరణాల రేటు తక్కువగా ఉండే దేశాల పీక్యూఎల్​ఐ విలువ ఎక్కువగా ఉంటుంది. పీక్యూఎల్​ఐ స్కేలు 1 నుంచి 100 ఉంటుంది. పీక్యూఎల్​ఐ విలువ 1కి దగ్గరగా ఉన్న దేశంలో అభివృద్ధి తక్కువగా ఉందని, పీక్యూఎల్​ఐ 100కి దగ్గరగా ఉన్న దేశంలో అభివృద్ధి ఎక్కువగా ఉందని అర్థం. మూడు అంశాల ఆధారంగా పీక్యూఎల్​ఐ విలువను లెక్కిస్తారు. కాబట్టి పీక్యూఎల్​ఐని మోరిస్​ మిశ్రమ సూచిక అని లేదా సామాన్య సమీకృత సూచీ అని పిలుస్తారు. పీక్యూఎల్​ఐలో శిశుమరణాల రేటు, ఆయు: ప్రమాణం, అక్షరాస్యత అన్నీ జనాభాకు సంబంధించినవే. అంటే సాంఘిక అంశాలే పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఆర్థిక అంశాలు పరిగణనలోకి తీసుకోలేదని విమర్శ ఉంది. 
బహుముఖ పేదరిక సూచీ: 2010 హెచ్​డీఆర్​ నుంచి హెచ్​పీఐ–1, హెచ్​పీఐ–2లను రద్దు చేసి, వాటి స్థానంలో యూఎన్​డీపీ వారు ఎంపీఐను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఎంపీఐను యూఎన్​డీపీ, ఆక్స్​ఫర్డ్​ యూనివిర్సిటీకి సంబంధించిన ఆక్స్​ఫర్డ్​ పావర్టీ, హ్యుమన్​ డెవలప్ మెంట్​ ఇనిషియేటివ్​ (ఓపీహెచ్​ఐ) వారు సంయుక్తంగా రూపొందించి ప్రకటించారు. 

ఎంపీఐ స్కేల్​ 0 నుంచి 1. దీనిని బట్టి ఒక దేశపు పేదరికపు స్థాయిని, పేదరికపు తీవ్రతను గుర్తించవచ్చు. (ఎంపీఐలో ర్యాంకులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు)
ఎంపీఐ విలువను లెక్కించడానికి జీవన ప్రమాణ స్థాయి, విద్య, ఆరోగ్యం అనే మూడు అంశాలకు సంబంధించి 10 సూచికలను తీసుకుంటారు. 
1. జీవన ప్రమాణ స్థాయిలో ఆస్తులు, గృహ వసతి, విద్యుత్​, తాగునీరు, టాయిలెట్స్​, వంట ఇంధనం
2. విద్య: పిల్లల నమోదు, హాజరు, సగటున స్కూల్​లో చదివిన సంవత్సరాలు ఆరు కంటే తక్కువగా ఉన్న పిల్లలు గల కుటుంబాలు
3. ఆరోగ్యం: బాలల మరణాల రేటు, పౌష్టికాహార లోపం

ఎంపీఐ 2021 ప్రకారం ప్రపంచంలో మొత్తం పేదవారి సంఖ్య 1.2 బిలియన్లు. ప్రపంచ పేదల సంఖ్యలో ఇండియాలో 22.8 కోట్లు, నైజీరియాలో 9.6 కోట్ల పేదలు ఉన్నారు. హెచ్​డీఆర్​ 2020 ప్రకారం భారత్​ ఎంపీఐ విలువ 0.123తో 27.91శాతంతో పేదరికంతో 62వ స్థానంలో ఉంది. 
లింగ సాధికారత కొలమానం(జీఈఎం): 1995 నుంచి యూఎన్​ఓ వారు జీఈఎంను ప్రవేశ పెట్టారు. మహిళలు ఆర్థిక, రాజకీయం, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారా? లేదా? అనే అంశాల ఆధారంగా జీఈఎంను లెక్కిస్తారు. ఇందులో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి.. 

1. ఆర్థిక భాగస్వామ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి (శ్రామికుల్లో స్త్రీల శాతం, కీలక అధికారుల్లో స్త్రీల వాటా)
2. రాజకీయ భాగస్వామ్యం (పార్లమెంట్​, శాసన సభల్లో స్త్రీల సభ్యుల వాటా) 
3. ఆర్థిక వనరులపై ఆధిక్యత ( ఆస్తుల యాజమాన్యంలో స్త్రీల వాటా)
లింగపరమైన వ్యత్యాసం తక్కువగా ఉన్న దేశం జీఈఎంలో అభివృద్ధి చెందిన దేశంగా లెక్కిస్తారు. చాలాసార్లు సమాచారం ఇవ్వకపోవడం వల్ల బారత్​ జీఈఎంలో పరిగణించబడలేదు. 

లింగ సంబంధిత అభివృద్ధి సూచీ: జీడీఐని 1995 నుంచి యూడీఎన్​డీపీవారు తమ మానవాభివృద్ధి నివేదికలో భాగంగా ప్రవేశపెట్టారు. స్త్రీ, పురుషుల మధ్య మానవాభివృద్ధిలో గల వ్యత్యాసాలను తెలుసుకోవడానికి జీడీఐ ఉపయోగపడుతుంది. హెచ్​డీఐలో తీసుకునే అంశాలను స్త్రీల వరకే పరిగణిస్తూ జీడీఐ విలువను లెక్కిస్తారు.  జీడీఐ స్కేల్​ 0 నుంచి 1 వరకు ఉంటుంది. హెచ్​డీఐ, జీడీఐల విలువల మధ్య వ్యత్యాసం లేకుంటే ఆ దేశంలో స్త్రీ, పురుషుల మధ్య అభివృద్ధికి సంబంధించి వ్యత్యాసం లేనట్లు  చెప్పవచ్చు. 
ప్రపంచ సంతోష సూచీ( డబ్ల్యూహెచ్​ఐ): యూఎన్​ఓకు చెందిన యునైటెడ్​ డెవలప్​మెంట్​ సస్టయినబుల్​ డెవలప్ మెంట్​ సొల్యుషన్స్​ నెట్​వర్క్​(ఎస్​డీఎస్​ఎన్​) వారు 2012 నుంచి  ప్రతి సంవత్సరం (2014 నుంచి)  ప్రపంచ సంతోష నివేదికలో భాగంగా ప్రపంచ సంతోష సూచీని రూపొందించి ప్రకటిస్తోంది. డబ్ల్యూహెచ్​ఐ విలువను లెక్కించడానికి ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి. తలసరి జాతీయాదాయం, హెల్తీ లైఫ్​ ఎక్స్​పెక్టెన్సీ, సామాజిక స్వేచ్ఛ, సామాజిక మద్దతు, దాతృత్వం, అవినీతిపై ప్రజాభిప్రాయం. డబ్ల్యూహెచ్​ఐ స్కేల్​ 0 నుంచి 10 వరకు ఉంటుంది. డబ్ల్యూహెచ్​ఐ విలువను బట్టి ప్రపంచ దేశాలకు ర్యాంకులను ఇస్తారు.  

మానవ అభివృద్ధి సూచిక 

ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధికి మేలైన సూచికగా హెచ్​డీఐని భావిస్తున్నారు. 1991లో పాకిస్తాన్​కు చెందిన ఆర్థికవేత్త మహబూబ్​ ఉల్​ హక్​ (అబుల్​ హక్​) హెచ్​డీఐని రూపొందించారు. ఈ సూచికను రూపొందించడంలో అబుల్​ హక్ కు ఆర్థికవేత్త అమర్త్యసేన్​ సహాయం చేశారు. హెచ్​డీఐ 1990 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి నివేదికలో భాగంగా యూఎన్​డీపీ వారు హెడీఐని తయారుచేసి ప్రకటిస్తున్నారు. అముల్​ హక్​ రూపొందించిన హెచ్​డీఐని యూఎన్​డీపీ వారికి అనుగుణంగా మారుస్తూ ఆర్థికవేత్త పాల్​ స్ట్రీటన్ అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి నివేదికలో ప్రపంచ దేశాల రెండు సంవత్సరాల క్రితపు సమాచారాన్ని అనుసరించి హెచ్​డీఐని తయారు చేసి ప్రకటించేవారు. కాని హెచ్​డీఆర్​ 2013 నుంచి ఏడాది క్రితపు సమాచారాన్ని అనుసరించి హెచ్​డీఐని తయారు చేసి ప్రకటిస్తున్నారు. హెచ్​డీఐ సూచీ విలువను లెక్కించడానికి మూడు అంశాలను ఆధారంగా తీసుకుంటారు. అవి..
1. ఆయు: ప్రమాణం/ ఆయుర్ధాయం/ జీవన కాలం
2. విజ్ఞానం/ విద్యాస్థాయి
3. జీవన ప్రమాణం  
హెచ్ డీఐ ‌‌‌‌‌‌‌‌ = ఎల్​ఈఐ + ఈఏఐ + ఎస్​ఎల్​ఐ/ 3
హెచ్​డీఆర్​–2010 నుంచి హెచ్​డీఐ విలువను లెక్కించడానికి అంకగణిత సగటు/ అంక మాధ్యమం బదులుగా గుణ మాధ్యమాన్ని పరిగణిస్తారు. 

ఆర్థిక సంక్షేమ కొలమానం 

ఈ సూచీని విలయం నర్ధవస్, జేబ్స్​ టోబిన్​ అనే ఆర్థిక వేత్తలు రూపొందించారు. ఎన్​ఈడబ్ల్యూ(నికర ఆర్థిక సంక్షేమం): ప్రజా సంక్షేమాన్ని పెంచే అంశాలు కొన్నింటిని వాస్తవ జాతీయాదాయానికి కలిపి, ప్రజా సంక్షేమాన్ని తగ్గించే అంశాలను తీసివేసి ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని ఆధునికీకరిస్తూ నికర ఆర్థిక సంక్షేమంగా పాల్​ శామ్యుల్​సన్​ రూపొందించాడు. వాస్తవ జాతీయాదాయానికి విశ్రాంతి సమయం విలువను, గృహిణుల సేవలు వంటి మార్కెట్​లోకి రాని సేవల విలువలను కలిపి పట్టణీకరణ, పర్యావరణ కాలుష్యం వంటి విలువలను తీసివేస్తే నికర ఆర్థిక సంక్షేమం తెలుపుతుంది. నికర ఆర్థిక సంక్షేమం= వాస్తవ జాతీయాదాయం + విశ్రాంతి సమయం విలువ + మార్కెట్​లో లెక్కింపబడని సేవల విలువ – పట్టణీకరణ – పర్యావరణ కాలుష్యం. 

ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ 

వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం వారు 2006 నుంచి ప్రతి సంవత్సరం జులైలో జీజీజీఐని ప్రకటిస్తున్నారు. లింగ వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే సూచీల్లో జీజీజీఐ కూడా ముఖ్యమైందే. ఇందులో మహిళలకు సంబంధించిన నాలుగు అంశాల ఆధారంగా సూచీ విలువను లెక్కిస్తారు. 1. ఎకనామిక్​ పార్టిస్పిషన్​ ఆపర్ట్యునిటీ, ఎడ్యుకేషన్​ అటైన్​మెంట్, హెల్త్​, సర్వైవల్​, రాజకీయ సాధికారత. జీజీజీఐ స్కేలు 0 నుంచి 1వరకు ఉంటుంది. దీని విలువ 0 ఉంటే పూర్తి వ్యత్యాసం ఉన్నట్లు, 1 ఉంటే పూర్తి సమానత్వం ఉన్నట్లుగా భావిస్తారు. 2022, జులైలో ప్రకటించిన జీజీఆర్​లో 146 దేశాల్లో భారత్​ 0.629 విలువతో 135వ స్థానంలో ఉంది.

లింగ అసమానత సూచీ (జీఐఐ)

2010 నుంచి జీడీఐ, జీఈఎంలకు బదులుగా యూఎన్​డీపీవారు జీఐఐని ప్రవేశపెట్టారు. ఇందులో మహిళల పునరుత్పాదక ఆరోగ్యం, మహిళా సాధికారత, మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం అనే మూడు కోణాలకు సంబంధించి ఎనిమిది అంశాల ఆధారంగా జీఐఐ విలువను లెక్కిస్తారు. అవి.. ప్రసూతి మరణాలరేటు, కౌమార దశలో సంతానం పొందిన వారి శాతం, పార్లమెంట్​లో మహిళల సీట్ల శాతం, 25 సంవత్సరాల వయస్సు దాటిన మహిళల్లో మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారి శాతం, శ్రామిక శక్తిలో మహిళల శాతం, మొదటి గర్భధారణకు ముందు, కనీసం ఒక్కసారైనా వైద్యున్ని సంప్రదించిన వారి శాతం, 15 – 45 సంవత్సరాల వివాహిత మహిళలో గర్భనిరోధక సాధనాలను వాడే వారి శాతం, శిక్షణ పొందిన వారి వద్ద ప్రసూతి పొందే వారి శాతం.  జీఐఐ స్కేల్​ విలువ 0 నుంచి 1 వరకు. జీఐఐ విలువ తక్కువగా ఉన్న దేశంలో లింగ వ్యత్యాసం తక్కువ అభివృద్ధి ఎక్కువ. కాబట్టి మొదటి ర్యాంక్​లో ఉంటాయి. జీఐఐ విలువ ఎక్కువగా ఉన్న దేశంలో లింగ వ్యత్యాసం ఎక్కువ అభివృద్ధి తక్కువ. కాబట్టి చివరి ర్యాంక్​లో ఉంటాయి. జీఐఐలో విలువకు విలోమంగా ర్యాంకులను ఇస్తారు.  హెచ్​డీఆర్​ 2021–22లో 2021 సమాచారాన్ని బట్టి రూపొందించి, ప్రకటించిన జీఐఐ 2021లో 170 దేశాల్లో భారత్​ 122వ స్థానంలో ఉంది.

ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్​ఐ)

  • జీహెచ్​ఐను 2006 నుంచి జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్​ ఫుడ్​ పాలసీ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ అనే స్వచ్ఛంద సేవా సంస్థ వారు రూపొందించి ప్రతి సంవత్సరం అక్టోబర్​లో ప్రకటిస్తున్నారు. ఇందులో నాలుగు అంశాల ఆధారంగా ఆకలి తీవ్రతను లెక్కిస్తారు. అవి. పోషకాహార లోపం గల జనాభా, ఐదేండ్లలోపు పిల్లల్లో తక్కువ బరువు కలిగిన పిల్లలు, ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎత్తు ఎక్కువ, తక్కువ పిల్లల మధ్య సరాసరి, బాలల మరణాల రేటు. 
  • జీహెచ్ఐ సూచీ విలువ స్కేల్​ 0 నుంచి 100 వరకు ఉంటుంది. జీహెచ్​ఐ విలువ 0 ఉంటే బెస్ట్​ స్కోర్​ కాబట్టి  ఆ దేశం మొదటి ర్యాంక్​లో ఉంటుంది. జీహెచ్ఐ విలువ 100 ఉంటే వరస్ట్​ స్కోర్​ కాబట్టి ఆ దేశం చివరి ర్యాంక్​లో ఉంటుంది. 
  • జీహెచ్​ఐ–2022ను అక్టోబర్​ 15న ప్రకటించారు. ఇందులో 135 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్​ఏఓ, యూఎన్​ఓ, డబ్ల్యూహెచ్​ఓ, ప్రపంచ బ్యాంక్​, యునిసెఫ్​, డెమోగ్రఫిక్​ హెల్త్​ సర్వే తదితర సమాచారం ఆధారంగా 121 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ 121 దేశాల్లో భారత్ 107వ స్థానంలో ఉంది.