ఇన్​ఫ్లేషన్ మాత్రం​ ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది : శక్తికాంత దాస్​

ఇన్​ఫ్లేషన్ మాత్రం​ ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది : శక్తికాంత దాస్​

ఈసారి ఏడు శాతం కంటే తక్కువే ఉండొచ్చు

న్యూఢిల్లీ: మన ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నా,  ఇన్​ఫ్లేషన్ (ధరల భారం) మాత్రం​ ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ అన్నారు. ఇన్​ఫ్లేషన్​ టార్గెట్​ 2–6 శాతాన్ని మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలోనే ఇది నాలుగు శాతానికి తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో 7.4 శాతం, ఆగస్టులో ఏడు శాతం రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ నమోదు కావడంతో ఆయన ఈ కామెంట్స్​ చేశారు. ఇన్​ఫ్లేషన్​ గత తొమ్మిది నెలలుగా ఆరు శాతం కంటే ఎక్కువగానే నమోదయింది. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘అక్టోబరు ఇన్​ఫ్లేషన్​ నంబర్లు సోమవారం విడుదలవుతాయి. ఈసారి ఇన్​ఫ్లేషన్​ ఏడుశాతం కంటే తక్కువే ఉంటుందని అనుకుంటున్నాం. ఈ సమస్యతో మనం సమర్థంగా పోరాడుతున్నాం. ఎన్నో  ఇబ్బందులతో సతమతమవుతున్న సంవత్సరంలోనే ఇండియా జీ20 పగ్గాలు చేపడుతోంది. జీ20లోని చాలా దేశాల కంటే ఇండియా మాక్రోఎకనమిక్​ ఫండమెంటల్స్​ బాగున్నాయి. ఫారెక్స్​ రిజర్వులను ఆర్​బీఐ విరివిగా వాడుతున్నదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆపదల్లో వాడుకోవడం కోసం ఫారిన్​ కరెన్సీ పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నాం. వర్షం వస్తేనే గొడుగు అవసరం ఉంటుంది. మాకు ప్రస్తుతం ఫారిన్​ కరెన్సీని వాడుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైనన్ని నిల్వలు మా దగ్గర ఉన్నాయి”అని ఆయన వివరించారు. బంగారం నిల్వలు భారీగా తగ్గడంతో ఈ ఏడాది నవంబర్ 4తో ముగిసిన వారానికి భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 1.087 బిలియన్ డాలర్లు తగ్గి 529.994 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్ లో వీటి విలువ 645 బిలియన్​ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.

మనం వేగంగా ఎదుగుతున్నం...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్​ అవతరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని   దాస్​ అన్నారు. ఈసారి మన ఎకానమీ ఏడుశాతం గ్రోత్​ సాధించడం ఖాయమని, ఇది​ 6.8 శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్​ కూడా చెప్పిందని  ఆర్​బీఐ గవర్నర్​ అన్నారు. మాక్రోఎకనమిక్​ ఫండమెంటల్స్​ బాగుండటం, ఫైనాన్షియల్​ సెక్టార్​నిలదొక్కుకోవడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడుశాతం వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.  బ్యాంకింగ్, నాన్​–బ్యాంకింగ్ సెక్టార్ల మద్దతుతో మనదేశ ఎకానమీ పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇండియా సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు చాలా షాకులు తగులుతున్నాయని చెప్పారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్​గా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం... అందరికీ ఇబ్బందేనని వివరించారు. ‘‘యూఎస్​ తోపాటు ఇతర ధనిక దేశాలు ద్రవ్యవిధానాన్ని కఠినతరం చేయడం వల్ల ఫైనాన్షియల్​ మార్కెట్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భారత్​ వంటి వర్ధమాన దేశాలపైనా ఈ ఎఫెక్ట్​ ఉంది. యూరప్​ దేశాలలో మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ దానిని తప్పించుకోగలిగే అవకాశాలూ ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నా, మిగతా దేశాల్లో గ్రోత్ నెమ్మదించింది. ఇండియా పరిస్థితులు బాగానే ఉన్నాయి”ఆయన వివరించారు.