హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ఐటీ ఎంటర్ప్రైజెస్ సేవల కంపెనీ ఇన్ఫర్మేటికా హైదరాబాద్లో బుధవారం తన నూతన ఇంజనీరింగ్ హబ్ను ప్రారంభించింది. ఇది కంపెనీలకు ఇంటెలిజెంట్ క్లౌడ్ సర్వీసెస్, బిగ్డేటా, డేటా ఇంటిగ్రేషన్, డేటా క్వాలిటీ, డేటా సెక్యూరిటీ, ఎండీఎం సేవలు అందిస్తుంది. అంతర్జాతీయంగా తమకు 100 పేటెంట్లు ఉన్నాయని, ఎనిమిది ఆర్ అండ్ డీ సెంటర్లు ఉన్నాయని తెలిపింది. ఆర్ అండ్ డీపై ఏటా 200 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ప్రెసిడెంట్ అమిత్ వాలియా చెప్పారు. హైదరాబాద్లో ప్రతిభావంతుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఇక్కడి హబ్ను మరింత విస్తరిస్తామన్నారు.
23 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆర్ అండ్ డీ సెంటర్ కోసం రెండు మిలియన్ డాలర్లు ఖర్చు చేశామని, ఇందులో 150 మంది పనిచేస్తున్నారని వివరించారు. కొన్నేళ్లలో వీరి సంఖ్యను రెట్టింపు చేస్తామని చెప్పారు. హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నైలోనూ ఆర్ అండ్ డీ సెంటర్లు ఉన్నాయని వాలియా వివరించారు. ఇది ఇన్ఫర్మేటికా డేటా కేటలాగ్ను మరింత అభివృద్ది చేస్తుందన్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను మరింతగా ప్రోత్సహించడానికి 2020ను తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రకటిస్తుందని వెల్లడించింది.

