న్యూఢిల్లీ: యూఎస్ మార్కెట్లో ట్రేడవుతున్న ఇన్ఫోసిస్ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్స్) గురువారం సెషన్లో 11 శాతం వరకు పడ్డాయి. ఏప్రిల్–జూన్ క్వార్టర్ (క్యూ1) రిజల్ట్స్ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవడమే ఇందుకు కారణం. కంపెనీ నికర లాభం కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 11 శాతం పెరిగి రూ.5,945 కోట్లు వచ్చింది. క్లయింట్లు ఐటీపై చేస్తున్న ఖర్చులను తగ్గించుకుంటుండడంతో పాటు, కొన్ని ప్రాజెక్ట్లు ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఇన్ఫోసిస్ ప్రాఫిట్ పెద్దగా పెరగలేదు. ఎకనామిక్ టైమ్స్ పోల్ వేసిన నికర లాభం అంచనా రూ.6,150 కోట్ల కంటే కంపెనీ ప్రాఫిట్ తక్కువగా రికార్డయ్యింది. ఇన్ఫోసిస్కు క్యూ1 లో రూ.37,933 కోట్ల రెవెన్యూ వచ్చింది.
కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రెవెన్యూతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే రెవెన్యూ అంచనాలను కంపెనీ తగ్గించింది. రెవెన్యూ గ్రోత్ గతంలో 4–7 శాతం మధ్య ఉంటుందని అంచనావేయగా, తాజాగా ఇది 1–3.5 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బట్టి కూడా కంపెనీ రిజల్ట్స్ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. నిలకడైన కరెన్సీ దగ్గర ఇన్ఫోసిస్ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో ఒక శాతం పెరగగా, ఆపరేటింగ్ మార్జిన్ 20 బేసిస్ పాయింట్లు తగ్గి 20.8 శాతంగా నమోదయ్యింది.
ఇప్పటికే ఒప్పందాలు జరిగి, ఇంకా స్టార్ట్ కాని డీల్స్ కొన్ని ఉన్నాయని, ఈ డీల్స్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకెండ్ హాఫ్లో రెవెన్యూ పెరగడం చూస్తామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు. రెవెన్యూ గైడెన్స్ తగ్గడంతో కంపెనీ షేర్లు పడతాయని బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ సంజీవ్ హోటా అన్నారు. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ మాదిరి ఇన్ఫోసిస్ పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చని, ఈ షేరుపై హోల్డ్ రేటింగ్ ఇచ్చామని వెల్లడించారు.