- పేదరికం నుంచి బయటపడాలంటే కష్టపడాల్సిందే
- 40 ఏళ్ల పాటు వారానికి 70 గంటలు పనిచేశానన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
న్యూఢిల్లీ : యువత వారానికి 70 గంటలు పనిచేయాలనే సలహాపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్పై డిబేట్ జరిగినా, తాను చెప్పింది తప్పు కాదని మూర్తి చెబుతున్నారు. ఇన్ఫోసిస్ను 1981 లో ఏర్పాటు చేసినప్పుడు వారానికి 70 గంటలకు పైగా పనిచేశానని గుర్తు చేశారు. దేశంలో ప్రొడక్టివిటీ పెరగాలంటే యువత కూడా 70 గంటలు పని చేయాలన్నారు.
‘ఉదయం 6.20 కే ఆఫీస్లో ఉండేవాడిని. రాత్రి 8.30 కు బయటకొచ్చేవాడిని. వారంలో ఆరు రోజులు ఇలానే పనిచేశాను’ అని మూర్తి అన్నారు. హార్డ్ వర్క్తోనే దేశాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. ‘పేదరికం నుంచి బయటపడాలంటే చాలా, చాలా కష్టపడాలని నా తల్లిదండ్రలు చిన్నప్పుడే నేర్పించారు. ఇది కూడా ప్రతీ గంటలో బెస్ట్ ప్రొడక్టివిటీ అందిస్తామని ఊహించుకుంటేనే’ అని మూర్తి అన్నారు. కాగా, మూర్తి పేరెంట్స్కు మొత్తం ఎనిమిది మంది పిల్లలు. ఆయన ఐదోవాడు. ఆయన తండ్రి మైసూర్లో స్కూల్ టీచర్గా పనిచేశారు. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందిన మూర్తి, ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ చదివారు.
తన 40 ఏళ్ల ప్రొఫెషనల్ లైఫ్లో వారానికి 70 గంటలు పనిచేశానని వెల్లడించారు. 1994 వరకు వారానికి 85 నుంచి 90 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కష్టం వృథా కాలేదని పేర్కొన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగిన విషయం తెలిసిందే. దేశ పెర్ క్యాపిటా ఇన్కమ్ 2,300 డాలర్లు ఉందని, ఇండియా పేద దేశమని మూర్తి అన్నారు. మిడిల్ ఇన్కమ్ దేశం కావాలంటే పెర్ క్యాపిటా 8,000 –10,000 డాలర్లకు చేరుకోవాలని చెప్పారు. ఈ లెవెల్కు చేరుకోవాలంటే ఇంకో 16 నుంచి 18 ఏళ్ల పాటు దేశ ఎకానమీ 8 శాతం గ్రోత్ సాధించాలని అంచనావేశారు. ఈ పేదరికం నుంచి బయటపడాలంటే చాలా, చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు.