మంచిర్యాల టీఎన్‌జీవోస్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై ఎంక్వయిరీ

మంచిర్యాల టీఎన్‌జీవోస్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై ఎంక్వయిరీ
  • విచారణ అధికారిగా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి.హనుమంత రెడ్డి 
  • ఆర్డర్స్ జారీ చేసిన కోఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్
  • ప్రాథమిక విచారణలో బయటపడ్డ అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై కోఆపరేటివ్ డిపార్ట్​మెంట్ ఫోకస్ పెట్టింది. సొసైటీ మెంబర్లకు ప్లాట్ల కేటాయింపుతో పాటు సొసైటీ నిర్వహణలో పలు అవకతవకలు జరిగాయని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై పలువురు సభ్యులు కలెక్టర్, సీసీఎల్ఏతో సహా కో ఆపరేటివ్ డిపార్ట్​మెంట్​కు ఫిర్యాదులు చేశారు.

ఈ మేరకు ప్రాథమిక విచారణ జరుపగా పలు అవకతవకలు బయటపడ్డాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సురేంద్ర మోహన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి.హనుమంత రెడ్డికి విచారణ బాధ్యతలు అప్పగించారు. 

29 ఎకరాలు కేటాయింపు

మంచిర్యాల కార్పొరేషన్ పరిధి నస్పూర్ శివారులోని 42 సర్వే నంబర్ ఉన్న 29 ఎకరాల ప్రభుత్వ భూమిని టీఎన్‌జీవోస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 20 ఏండ్ల క్రితం కేటాయించారు. 2010లో 340 మంది సభ్యులకు 175 గజాల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అయితే ఇటీవల జరిగిన ఆడిట్‌లో అవకతవకలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో సహకార శాఖ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టగా పలు అక్రమాలు వెలుగు చూశాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1995 సెక్షన్ 29 ప్రకారం విచారణకు ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రాథమిక విచారణలో..  

సహకార శాఖ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో కొంతమంది వారికి కేటాయించిన 175 గజాల విస్తీర్ణానికి మించి బిల్డింగులు కట్టినట్టు తేలింది. మరికొందరు సభ్యులు వారికి కేటాయించిన ప్లాట్ నంబర్లలో కాకుండా రోడ్ సైడ్ ఉన్న ఇతర ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. జి.హనుమంత రావుకు 175 గజాలు కేటాయించగా.. ఆయన 242 గజాల్లో నిర్మాణం  చేపట్టారు.

టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, హోసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్న గడియారం శ్రీహరికి ప్లాట్ నంబర్ 59/ఆ కేటాయిస్తే 24 నంబర్ ప్లాట్​లో బిల్డింగ్ నిర్మించారు. శ్రీపతి బాపురావు ప్లాట్ 5/ఏ కాగా 73 నంబర్ లో, ఏసయ్య 70/బీకి బదులుగా 101లో, పొన్న మల్లయ్య 70/బీ కాగా 102లో, సునీత 92/ఏకు బదులు 63లో, కె.సురేశ్ బాబుకు కేటాయించిన 77/ఏ నంబర్ లో కాకుండా 104 నంబర్ ప్లాట్​లో బిల్డింగులు కట్టారు. ఇలాంటి అవకతవకలు చాలా జరిగినట్టు తెలుస్తోంది. 

సొసైటీ నిర్వహణలో లోపాలు

టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో సుమారు 341 మంది ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నప్పటికీ మాక్స్ చట్టం ప్రకారం ఎలక్షన్లు జరగడం లేదన్న విషయం ప్రాథమిక విచారణలో వెళ్లడయ్యింది. మాక్స్ చట్టం సెక్షన్ 23 ప్రకారం సొసైటికీ నిర్ణీత కాలవ్యవధి ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉన్నా నిర్వాహకులు సదరు రూల్స్ ఉల్లంఘించారు. అలాగే సెక్షన్ 34 ప్రకారం యాన్యువల్ రిటర్నులు ఫైల్ చేయలేదు. లెక్కలు, ఖాతాలు నిర్వహించలేదు. మొన్నటిదాకా సొసైటీకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదని తేలింది. మరోవైపు డెవలప్​మెంట్ ఫీజుల పేరిట రూ.లక్షలు వసూలు చేసినట్లు రుజువైంది. కొన్ని ప్లాట్లలో అసలు కేటాయింపులు లేనివారు నిర్మాణాలు జరిపారు. ఇది భవిష్యత్​లో న్యాయపరమైన సమస్యలకు దారి తీయవచ్చని భావిస్తున్నారు.  

45 రోజుల గడువు

ఎంక్వయిరీ ఆఫీసర్ జి.హనుమంత రెడ్డి వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి 45 రోజుల్లోపు డీటేయిల్డ్ రిపోర్ట్ రిజిస్ట్రార్‌కు సమర్పించాల్సి ఉంది. సొసైటీ నిర్వహణలో ఉన్న లోపాలు, సమస్యలను పరిశీలించడంతో పాటు భవిష్యత్​లో ఇలాంటి అక్రమాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, విధానాలను ఆయన సూచించాల్సి ఉంటుంది. విచారణ ప్రారంభమైన నేపథ్యంలో పలు ప్లాట్లలో ఇప్పటికే ఇండ్లు నిర్మించుకున్న సభ్యుల్లో కలవరం మొదలైంది. కొంతమంది తమకు కేటాయించిన ప్లాట్లే కాకుండా ఇతరులవి ఆక్రమించారని ఆరోపణలున్నాయి. ఈ విచారణలో నిజం బయటపడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరుతున్నారు.