ఇన్‌స్పిరేషన్ స్టోరీ : అదిరిందయ్యా చంద్రం

ఇన్‌స్పిరేషన్ స్టోరీ : అదిరిందయ్యా  చంద్రం

అదిరిందయ్యా చంద్రం.. 

కొత్త ఇల్లు.. 
కొత్త బండి.. 
కొత్త భార్య.. అద్భుతం... అంటూ టీవీలో వచ్చిన ఈ అడ్వర్టైజ్​మెంట్​ చాలామందికి పరిచయమే. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ఇంటికి వచ్చిన అదే వ్యక్తి వస్తాడు. అప్పుడు కారు పాతబడిపోతుంది. భార్య వయసు పెరుగుతుంది. కానీ.. ఏషియన్​ పెయింట్స్​ వేసిన ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా, కొత్తదానిలా మెరుస్తుంటుంది. అచ్చం ఆ ఇంటి పెయింట్​ లాగానే ఏషియన్​ పెయింట్స్​ బ్రాండ్​ ఇమేజ్​ కూడా దశాబ్దాల నుంచి చెదిరిపోవడం లేదు. గ్యారేజీలో పనిచేసే నలుగురు ఫ్రెండ్స్​ కలిసి పెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు 60కి పైగా దేశాల్లో పెయింట్స్​ అమ్మే స్థాయికి ఎదిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియాలో పెయింట్స్​కి బాగా డిమాండ్​ పెరిగింది. అందుకు కారణం.. అవసరాలకు సరిపడా పెయింట్ అందుబాటులో లేకపోవడమే. అప్పటివరకు ఎక్కువగా విదేశాల నుంచి పెయింట్స్​ దిగుమతి చేసుకునేవాళ్లు. కానీ.. యుద్ధం వల్ల దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది అప్పటి బ్రిటిష్​ గవర్నమెంట్. అప్పటివరకు ఇండియాలో షాలిమార్​ పెయింట్స్​తో పాటు కొన్ని కంపెనీలు మాత్రమే పెయింట్స్​ని ఉత్పత్తి చేస్తుండేవి. 

అదే టైంలో మార్కెట్​లో పెయింట్స్​కు ఉన్న డిమాండ్​ గుర్తించిన 26 ఏండ్ల చంపక్‌‌లాల్ చోక్సీ కంపెనీ పెట్టాలని డిసైడ్​ అయ్యాడు. ఆ ఐడియాను తన ముగ్గురు ఫ్రెండ్స్​ తోపాటు చిమన్‌‌లాల్ చోక్సీ, సూర్యకాంత్ దని, అరవింద్​కి చెప్పాడు. వాళ్లు కూడా మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వడానికి అదే మంచి టైం అనుకున్నారు. చంపక్‌‌లాల్​తో కలిసి 1942లో ముంబయిలో ఏషియన్​ పెయింట్స్​ కంపెనీని మొదలుపెట్టారు. ఈ కంపెనీ పెట్టకముందు వీళ్లంతా ఒక చిన్న గ్యారేజీలో పనిచేసేవాళ్లు.

ఎన్నో వ్యూహాలు

ఏషియన్​ పెయింట్స్ 1942లో చాలా చిన్న కంపెనీగా మొదలై.. చంపక్‌‌లాల్ ఐడియాల వల్ల ​పదేండ్లలోనే టాప్​ కంపెనీల పక్కన చేరింది. 1952 నాటికి ఏషియన్ పెయింట్స్ టర్నోవర్‌‌ ఏడాదికి 23 కోట్ల రూపాయలకు చేరింది. 1967 నాటికి  ఇండియాలో నెంబర్​ వన్​ కంపెనీగా ఎదిగింది. ఇండియన్స్​ ఫేవరెట్​ బ్రాండ్​గా మారింది. అప్పటినుంచి ఈ రోజు వరకు ఆ స్థానాన్ని అలానే నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఇండియాలో మొదటి స్థానంలో ఉండడమే కాదు.. ఆసియాలో రెండో అతి పెద్ద డెకరేటివ్​ కోటింగ్స్​ ప్రొడక్షన్​ కంపెనీగా పేరు తెచ్చుకుంది. 

ఎన్నో ఒడిదుడుకులు 

చిన్న గ్యారేజీలో పనిచేసే స్థాయి నుంచి సొంత కంపెనీ పెట్టే వరకు ఎదగడం ఒక ఎత్తైతే.. కంపెనీని లాభాల వైపు నడిపించడం మరో ఎత్తు. చంపక్​లాల్​ కంపెనీ పెట్టిన కొత్తలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అప్పటికే ముంబయి మార్కెట్​లో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్​ ఉన్నారు. వాళ్లే చిన్న టౌన్​లకు పెయింట్స్​ని సప్లై చేసేవాళ్లు. కాబట్టి కంపెనీలకు ముంబయిలోనే అమ్మకాలు ఎక్కువ జరిగేవి. కానీ... ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏషియన్​ పెయింట్స్ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో చంపక్​లాల్​ ఒక ప్లాన్​ వేశాడు. మార్కెట్​లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల మీద ఆధారపడడం కంటే.. తనే ఒక డిస్ట్రిబ్యూషన్​ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. సిటీల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను నమ్ముకునే బదులు టౌన్​లలోనే కొందరికి డీలర్​షిప్​ ఇవ్వాలి అనుకున్నాడు. 

మహారాష్ట్రలోని సతారాలోని సాంగ్లీలో డైరెక్ట్ డీలర్‌‌షిప్​ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రతి టౌన్​లో డైరెక్ట్ డీలర్లను నియమించి నేరుగా వాళ్లకే పెయింట్స్​ సప్లై చేశాడు. అప్పటివరకు టౌన్లలో ఉండే వ్యాపారులు సిటీలకు వెళ్లి పెయింట్స్​ కొనేవాళ్లు. కానీ.. ఏషియన్​ పెయింట్స్​ తమ ఊరి వరకు సప్లై చేస్తుండడంతో వాటినే ఎక్కువగా అమ్మడం మొదలుపెట్టారు. పైగా డిస్ట్రిబ్యూటర్లు అమ్మే ధర కంటే.. కంపెనీ తక్కువ ధరకు అమ్మింది. ఇదెలా సాధ్యమైందంటే.. డైరెక్ట్​గా డీలర్లకు ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్​ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇదంతా చూసిన ముంబయిలోని పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వాళ్లంతట వాళ్లే ఏషియన్​ పెయింట్స్​ అమ్ముతామని కంపెనీ దగ్గరకు వెళ్లాయి. ఏషియన్ పెయింట్స్‌‌ను స్టోర్​ చేసుకోవడం, అమ్మడం మొదలుపెట్టాయి. దాంతో సిటీల్లో మార్కెట్​ పెరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏషియన్​ పెయింట్స్​ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు మెట్రో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కంపెనీ నెట్​వర్క్​ బాగా విస్తరించింది. గ్రామాల వరకు డైరెక్ట్​గా కంపెనీ నుంచే డిస్ట్రిబ్యూట్​ చేస్తున్నారు. అందుకే సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ అమ్మకాలు జరుగుతుంటాయి. 

కొత్త ఎత్తులు

డీలర్​షిప్​​ వ్యవస్థ తీసుకొచ్చి సొంత మార్కెట్​ క్రియేట్​ చేసుకున్న తర్వాత కూడా కంపెనీ ఎదుగుదల కోసం కొత్త ప్లాన్స్​ ఆలోచించాడు చంపక్​లాల్. ఎప్పుడూ మార్కెట్​ని గమనిస్తూ.. ప్రొడక్ట్స్​లో మార్పులు చేస్తుండేవాడు. కస్టమర్​కు కావాల్సిన దాన్ని ఎలాగైనా అందించాలనే లక్ష్యంతో పనిచేసేవాడు. అలాంటి ఆలోచనల వల్లే పెయింట్స్​లో ఏషియన్​ బ్రాండ్​గా ఎదిగింది. మార్కెట్​ పెంచుకునే ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునేవాడు కాదు చంపక్​లాల్​​. ఉదాహరణకు.. తమిళనాడులో ‘పొంగల్’​, మహారాష్ట్రలో ‘పోలా’ పండుగలప్పడు ఎద్దులను పూజిస్తుంటారు. 

వాటి కొమ్ములకు రంగులు వేస్తుంటారు. అలాంటి టైంలో రంగు డబ్బాలు బాగా కొంటుంటారు. కానీ.. తక్కువ క్వాంటిటీ డబ్బాలు మార్కెట్​లో దొరికేవి కావు. దాంతో కొందరు రంగు డబ్బాలు కొనడం మానేసేవాళ్లు. ఆ విషయం తెలుసుకున్న చంపక్​లాల్​100, 150 మిల్లీ లీటర్ల చిన్న రంగు డబ్బాలను మార్కెట్​లోకి తెచ్చాడు. ఎద్దుల కొమ్ములకు పూస్తారు కాబట్టి బ్రైట్​గా కనిపించేందుకు ప్రత్యేకంగా రంగులు తయారుచేయించాడు. ఎద్దులు వాటి కొమ్ముల్ని బురదలో రుద్దినా కలర్​ డల్​ కాకుండా ఉండేలా క్వాలిటీ పెయింట్​ని తీసుకొచ్చాడు. ఆ ఐడియా బాగా సక్సెస్​ అయింది. దాంతో పండుగలప్పుడు ఏషియన్​ పెయింట్స్​ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. 

డిస్టెంపర్‌‌ లాంచ్ 

ఇదివరకు చాలామంది ఇండ్లకు సున్నం వేసుకునేవాళ్లు. ఆ సున్నం బట్టలకు అంటుకునేది. కొద్దిరోజుల్లోనే కలర్​ డిమ్​ అయ్యేది. అప్పట్లో బట్టలకు అంటుకోని ప్లాస్టిక్ ఎమల్షన్ సున్నం కూడా మార్కెట్​లో దొరికేది. కానీ.. ఈ సున్నం ధర మామూలు సున్నంతో పోలిస్తే.. ఐదు రెట్లు ఎక్కువ. అందుకే మిడిల్​ క్లాస్​ వాళ్లు మామూలు సున్నాన్నే వాడేవాళ్లు. ఇది గమనించిన చంపక్​లాల్​..  సున్నం కంటే కాస్త ఎక్కువ ధరలో, ప్లాస్టిక్​ ఎమల్షన్​ కంటే చాలా తక్కువ ధరలో దొరికే ఒక ప్రొడక్ట్​ని డిజైన్​ చేశాడు. అదే ఏషియన్​ పెయింట్స్​ 
నుంచి వచ్చిన వాషబుల్​ డిస్టెంపర్‌‌. దీని మీద నీళ్లు పడ్డా కలర్​ తగ్గదు. ఈ ప్రొడక్ట్​ మార్కెట్​లో బాగా సక్సెస్​ అయ్యింది. ఏషియన్​ పెయింట్స్ అతిపెద్ద పెయింట్ కంపెనీగా ఎదగడానికి ఇది కూడా ఒక కారణమే.  

ఉద్యోగులతో.. 

తమ ఉద్యోగులతో మంచి రిలేషన్​షిప్​ మెయింటెన్​ చేస్తుంటుంది కంపెనీ. అంతేకాదు.. టాలెంట్​ ఉన్నవాళ్లకే ఉద్యోగాలు ఇస్తుంటుంది. ఏషియన్​ పెయింట్స్​ సక్సెస్​లో వాళ్ల పాత్ర కూడా బోలెడంత ఉంది. ఇందులో చేరిన వాళ్లలో చాలామంది రిటైర్​ అయ్యేవరకు ఇక్కడే పని చేస్తారు. అంతెందుకు ఇదివరకు ఈ కంపెనీకి సీఈవోగా పనిచేసిన కేబీఎస్​ ఆనంద్ కూడా1970లో ఏషియన్ పెయింట్స్ ఉద్యోగి.

నయా టెక్నాలజీ

ఏషియన్ పెయింట్స్1974లోనే కంప్యూటర్‌‌ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. కంపెనీకి లాభాలు తెచ్చే ఏ టెక్నాలజీ మార్కెట్​లోకి వచ్చినా.. వెంటనే అమలు చేస్తుంది. కంపెనీల్లో పే రోల్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్‌‌ల కోసమే కంప్యూటర్లను వాడుతున్న రోజుల్లో ఏషియన్ పెయింట్స్ కంప్యూటర్‌‌ల సాయంతో డేటా అనలిటిక్స్‌‌ చేసేది. ఆ డేటాతో డిమాండ్​, సప్లై గురించి తెలుసుకునేది. ఏషియన్ పెయింట్స్ ఎప్పుడూ కోర్ బిజినెస్​ మీద ఫోకస్​ పెడుతుంది. అంటే.. ప్రొడక్ట్​ని కస్టమర్​కి కావాల్సినట్టు కస్టమైజ్​ చేసి ఇస్తుంటుంది. దీనివల్ల అన్ని రకాల కస్టమర్లకు దగ్గరైంది. ప్రస్తుతం సిటీలతోపాటు చిన్న చిన్న టౌన్లలో కూడా కస్టమర్లకు కస్టమైజ్డ్​ ప్రొడక్ట్స్​ ఇస్తున్నారు. అందుకోసం ఏషియన్​ పెయింట్స్​ డీలర్లకు కొన్ని మెషిన్స్​ ఇస్తారు. వాటి ద్వారా కస్టమర్లకు కావాల్సిన ఎలాంటి కలర్​ అయినా అప్పటికప్పుడు మిక్స్​ చేసిస్తారు.

మార్కెట్​ వాటా

ప్రస్తుతం ఇండియాలో పెయింట్ ఇండస్ట్రీ మార్కెట్ వాటాలో దాదాపు 50 శాతం వాటా ఏషియన్​ పెయింట్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. కొన్ని దశాబ్దాల నుంచి ఈ కంపెనీ​ గ్రోత్​ రేట్​ ఏడాదికి 20 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఏ ఒక్కటీ ఏషియన్​ను దాటలేకపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీకి 27 మాన్యుఫాక్చరింగ్​ యూనిట్స్​ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ప్రొడక్ట్స్​ అమ్ముతోంది. కేవలం ఇండియాలోనే ఈ కంపెనీకి లక్షా 50 వేల మందికి పైగా రిటైలర్స్​ ఉన్నారు. డెకరేటివ్​ కోటింగ్స్​ కేటగిరీలో ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది ఏషియన్​ పెయింట్స్​.