
- ఏ హోదాలో ఉన్నా ప్రొటెక్షన్ ఇవ్వొద్దని సూచన
అవినీతిపరులకు రాజకీయ, సామాజిక సెక్యూరిటీ కల్పించొ ద్దని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని మోడీ సూచించారు. అవినీతికి పాల్పడిన వారు ఏ హోదాలో ఉన్నా.. ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని అన్నారు.
న్యూఢిల్లీ: అవినీతిపరులకు రాజకీయ, సామాజిక సెక్యూరిటీ కల్పించొద్దని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని మోడీ సూచించారు. అవినీతికి పాల్పడిన వారు ఏ హోదాలో ఉన్నా.. ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, వారిపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీపీ) ఏర్పాటు చేసిన ‘‘విజిలెన్స్ అవేర్నెస్ వీక్” కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాలతో కొందరు విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని దర్యాప్తు ఏజెన్సీలకు సూచించారు. ‘‘చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, నేరం రుజువై జైలుకెళ్లి వచ్చిన వారు సమాజంలో ప్రశంసలు పొందుతున్నారు. కొందరు నిజాయితీపరులు ఇలాంటి వారితో ఫొటోలు దిగేందుకూ సిగ్గుపడటం లేదు. ఇలాంటి అవినీతిపరులు, ఇలాంటి వాతావరణం మన సమాజానికి మంచిదికాదు”అని మోడీ అన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ సేవలు భేష్..
అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని మోడీ మెచ్చుకున్నారు. సమాజ సంక్షేమానికి పనిచేస్తున్నప్పుడు గిల్టీగా బతకాల్సిన అవసరం లేదని దర్యాప్తు ఏజెన్సీ అధికారులను ఉద్దేశించి అన్నారు. ఆడిట్, ఇన్స్పెక్షన్స్ను మరింత ఆధునీకరించేందుకు విజిలెన్స్ సంస్థలు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి నిరోధక చర్యలపై ప్రభుత్వ శాఖలకు ర్యాంకింగ్స్ ఇచ్చేలా చూడాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతికి చోటు లేకుండా చేయాలని, కరప్షన్ను ప్రోత్సహించని వ్యవస్థను మనం రూపొందించుకోవాలని అన్నారు.