అసెంబ్లీకి వస్తే గేట్ కు తాళం వేస్తారా.? గవర్నర్ ఫైర్

అసెంబ్లీకి వస్తే గేట్ కు తాళం వేస్తారా.? గవర్నర్ ఫైర్

పశ్చిమ బెంగాళ్ గవర్నర్ జగదీప్ ధంఖర్కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీని సందర్శించేందుకు వెళ్ళిన ఆయనకు అక్కడ గేటుకు తాళం వేసి ఉండటంతో అసహనానికి గురయ్యారు. అసెంబ్లీలో వీవీఐపీలు, గవర్నర్ రాకపోకల కోసం గేట్ నంబర్ 3 ని  కేటాయించారు. అయితే ఇవాళ గవర్నర్  అక్కడికి వెళ్లే సరికి గేట్ కు తాళం ఉంది..దీంతో తెరిచి ఉన్న వేరే గేటు నుంచి ఆయన లోపలికి వెళ్లారు.

గేటు మూసివేసి ఉండటంతో ఆగ్రహానికి గురైన ఆయన..అసెంబ్లీ  గేటు వద్దే మీడియా ముందు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాను అసెంబ్లీకి వస్తానని ముందే సమాచారం ఇచ్చినా గేటుకు తాళం ఎందుకు వేశారని ప్రశ్నించారు. తనను అవమాన పరిచారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు  వాయిదా వేయడమంటే.. మూసివేయమన్నట్లు కాదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు.