
వీపనగండ్ల (చిన్నంబావి), వెలుగు: తాగుడుకు బానిసై తరుచూ భార్యను అనుమానించే ఓ భర్త ఇంట్లో నిద్రిస్తున్న భార్య బిడ్డలపై కిరోసిన్ పోసి నిప్పంటించిండు. తాగిన మత్తులో తనూ కిరోసిన్ పోసుకొని మంటలు అంటించుకున్నడు. వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలో జరిగిన ఈ దారుణంలో ఇంటర్ చదివే కూతురు, నిప్పంటించిన సైకో తండ్రి మృతిచెందగా తీవ్రంగా గాయపడిన భార్య దవాఖానాలో చావుబతుకుల మధ్య ఉన్నారు. జయన్నయాదవ్(45), వరలక్ష్మి(37) భార్యాభర్తలు.
వీరికి కొడుకు సృజన్, కూతురు గాయత్రి(17) ఉన్నారు. వరలక్ష్మి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. కొడుకు హైదరాబాద్లో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. గాయత్రి ఇంటర్ చదువుతోంది. హైదరాబాద్లో పనిచేసే జయన్నయాదవ్ కొన్నాళ్ల క్రితం అది మానేసి సొంతూరు వచ్చి ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న అతను తరచూ తాగొచ్చి ఆమెను వేధించేవాడు. బుధవారం అర్ధరాత్రి ఫుల్లుగా మందు తాగిన జయన్న ఇంట్లో నిద్రిస్తున్న భార్య బిడ్డలపై కిరోసిన్ పోశాడు. లైటర్ వెలిగించేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు లేచి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఆగకుండా లైటర్ వెలిగించడంతో వారికి నిప్పంటుకుంది. ఆ వెంటనే తనూ కిరోసిన్ పోసుకొని మంటలు అంటించుకున్నాడు. మంటల్ని గుర్తించిన చుట్టుపక్కల వారు వచ్చి ఆర్పేశారు. కొద్దిసేపటికే గాయత్రి, జయన్న మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని కొల్లాపూర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో మహబూబ్నగర్ దవాఖానాకు తరలించారు. కొడుకు సృజన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ నాయక్ తెలిపారు.