IPL 2024: వాంఖడే గడ్డ.. ముంబై అడ్డా..! ఒక వేదికపై అత్యధిక విజయాలు సాధించిన జట్లివే

IPL 2024: వాంఖడే గడ్డ.. ముంబై అడ్డా..! ఒక వేదికపై అత్యధిక విజయాలు సాధించిన జట్లివే

సొంతగడ్డపై ఆడిన జట్లు విజయం సాధించడం అనేది ఐపీఎల్ టోర్నీలో ఒక ఆనవాయితీ. ప్రారంభ సీజన్ 2008 నుంచి ప్రస్తుత ఎడిషన్ 2024 వరకూ ఈ ఏడాది తీసుకున్న ఆవే ఫలితాలు. హోమ్ గ్రౌండ్‌లో ఆడిన జట్లు ఎక్కువ శాతం మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ప్రస్తుత సీజన్‌లోనూ అంతే. ఇప్పటివరకూ ఈ ఎడిషన్‌లో 21 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. 16 మ్యాచ్‌ల్లో సొంతగడ్డపై ఆడిన జట్లే విజయం సాధించాయి. ఈ గణాంకాలను బట్టి హోమ్ గ్రౌండ్ అనేది జట్లకు ఎంత అడ్వాంటేజ్ మారుతోందో అర్థం చేసుకోవచ్చు.

ఒక వేదికపై అత్యధిక విజయాలు అందుకున్న జట్లలో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

వాంఖడే గడ్డ.. ముంబై అడ్డా

ఆదివారం(ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై.. వాంఖడే స్టేడియంలో 50వ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా, సూపర్ ఓవర్ విజయాలతో సహా ఒక వేదికపై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది. 

ఈడెన్ లో కోల్‌కతాదే పైచేయి 

ఇప్పటివరకూ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) తమ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 48 ఐపీఎల్ విజయాలు సాధించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ వేదికపైనే 2017లో ఆర్సీబీ జట్టు 49 పరుగులకు ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకుంది. 

చెపాక్.. సీఎస్‌కే సామ్రాజ్యం

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సొంత కోటైన చిదంబరం స్టేడియంలో ఆ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థి జట్లు కాస్త ఎక్కువ శ్రమించాల్సిందే. చెపాక్ వేదికపై సీఎస్‌కే జట్టు ఇప్పటివరకూ 47 విజయాలు సాధించింది. 2011లో ఇదే వేదికపై ఆర్సీబీని ఓడించి రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.

చిన్నస్వామి.. ఆర్‌సీబీ

ప్రస్తుత ఎడిషన్ లో తమ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్ లోనూ పరాజయం పాలైన ఆర్సీబీ జట్టు.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకూ 41 విజయాలు నమోదు చేసింది. 2008లో ఈ మైదానంలో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ లో బ్రెండన్ మెకు కలమ్(158*) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు.

సవాయ్ మాన్‌సింగ్.. రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ తమ సొంత మైదానం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో అద్భుతంగా ఆడింది. జైపూర్‌లోని ఈ మైదానంలో 55 ఐపీఎల్ మ్యాచ్‌లకు గాను 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.