- యూఏఈలో ఐపీఎల్ ఫేజ్2
- సెప్టెంబర్ 18న రీస్టార్ట్ !
- అక్టోబర్ 9 లేదా 10న ఫైనల్
- 10 డబుల్ హెడర్ మ్యాచ్లు
ఐపీఎల్ ఫేజ్–2కు రంగం సిద్ధమవుతోంది..! అందరూ అనుకున్నట్లుగానే... అరబ్ గడ్డపైనే ధనాధన్ లీగ్ను కంప్లీట్ చేసేందుకు బీసీసీఐ ప్లాన్స్ వేస్తోంది..! అయితే ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు బాగా లేకపోవడంతో.. మూడు వారాల్లోనే మిగిలిన 31 మ్యాచ్లను పూర్తి చేయాలని భావిస్తోంది..! ఇదే జరిగితే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18న లీగ్ను రీస్టార్ట్ చేసి..అక్టోబర్ 10న తెరదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..! మొత్తానికి అందర్ని సంతృప్తి పరిచే విధంగా లీగ్ను ఫినిష్ చేయాలని బోర్డు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది..!!
న్యూఢిల్లీ: ఐపీఎల్–14 వాయిదా పడి నెల రోజులు కూడా గడవకముందే.. లీగ్ను మళ్లీ పట్టాలెక్కించేందుకు బీసీసీఐ రెడీ అవుతున్నది. అనీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్–అక్టోబర్ విండోలో లీగ్ను కంప్లీట్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పుడున్న సమాచారం మేరకు.. మిగిలిపోయిన 31 మ్యాచ్లను మూడు వారాల విండోలో ఫినిష్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అంటే సెప్టెంబర్ 18 లేదా 19న లీగ్ను రీస్టార్ట్ చేసి అక్టోబర్ 9 లేదా 10న ఫైనల్తో ఫినిష్ చేయాలనుకుంటోంది. క్రికెటర్లు, స్టేక్ హోల్డర్స్, బ్రాడ్కాస్టర్స్, ఫ్రాంచైజీలను సంతృప్తి పరిచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ‘లీగ్కు సంబంధించిన అన్ని స్టేక్ హోల్డర్స్, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్స్తో రీస్టార్ట్ గురించి బీసీసీఐ చర్చించింది. 18, 19 శని, అదివారాలు ఉండటంతో రీస్టార్ట్కు ఇంతకంటే మంచి చాన్స్ ఉండదు. ఫైనల్ కూడా సేమ్ వీకెండ్లోనే వస్తుంది. ఇప్పటికైతే ప్రాధమిక షెడ్యూల్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాం. మొత్తం 10 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండొచ్చు. అలాగే, 4 మెయిన్ మ్యాచ్లు (2 క్వాలిఫయర్స్, 1 ఎలిమినేటర్, ఫైనల్) ఉంటాయి. ఓవరాల్గా 31 మ్యాచ్లను మూడు వారాల విండోలో పూర్తి చేస్తాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నాడు.
డైరెక్ట్గా దుబాయ్కు..
యూకే టూర్ తర్వాత టీమిండియాతో పాటు, ఇంగ్లండ్ ప్లేయర్లందరూ ఐపీఎల్ ఫేజ్2 కోసం నేరుగా దుబాయ్ చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 14న మాంచెస్టర్లో ఇంగ్లండ్తో లాస్ట్ టెస్ట్ ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు చార్టెడ్ ఫ్లైట్లో ఇరుజట్ల ప్లేయర్లు దుబాయ్కు చేరుకుంటారు. అంటే బబుల్ టు బబుల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ‘రెండు టీమ్లు ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడే వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా డైరెక్ట్గా యూఏఈకి చేరుకుంటారు. వాళ్లకు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్కర్ని కూడా కమర్షియల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేయకుండా చూస్తాం’ అని బోర్డు సోర్సెస్ వెల్లడించాయి.
సౌతాఫ్రికా సిరీస్ రద్దు
ఐపీఎల్ పూర్తి చేయడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన బీసీసీఐ.. ఇందుకోసం కొన్ని త్యాగాలు కూడా చేస్తున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్లో సౌతాఫ్రికాతో జరగాల్సిన వైట్బాల్ సిరీస్ను బోర్డు రద్దుచేయనుంది. టీ20 వరల్డ్కప్ ప్రిపరేషన్స్ కోసం దీనిని షెడ్యూల్ చేసినా.. ఐపీఎల్ కంటే బెటర్ టోర్నీ మరోటి లేదని ఇండియన్ బోర్డు భావిస్తోంది. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ సఫారీలతో సిరీస్ జరగదు. దాని ప్లేస్లో ఐపీఎల్లాంటి మెగా లీగ్ ఆడటం కంటే టీ20 వరల్డ్కప్కు మంచి ప్రిపరేషన్ మరోటి లేదు. లీగ్ ముగిసిన వెంటనే వారం, పది రోజుల్లో మెగా ఈవెంట్ మొదలవుతుంది. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత ప్లాన్ చేస్తాం. వచ్చే ఏడాది ఎలాగూ అక్కడికి వెళ్లే చాన్స్ ఉంది. ఆ టైమ్లోనే ఎక్కువ మ్యాచ్లు ఆడతాం’ అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.
కివీస్తో సిరీస్ షిఫ్ట్..
హోమ్ సిరీస్లో భాగంగా ఇండియా... న్యూజిలాండ్తో నవంబర్లో ఆ రెండు టెస్ట్లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ను కూడా షిఫ్ట్ చేసే చాన్స్ ఉంది. టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత ఈ సిరీస్ జరిగే చాన్స్ ఉంది. దీనిపై బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు టీ20 వరల్డ్కప్ వేదికపై ఇంకా స్పష్టత రాలేదు. ఇండియాలో కరోనా సిచ్యువేషన్స్ను బట్టి దీనిపై నిర్ణయం వచ్చే చాన్స్ ఉంది. హెల్త్ ఎమర్జెన్సీ వల్ల వేరే దేశాలు ఇండియా వచ్చేందుకు ఇష్టపడకపోతే అప్పుడు మరో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్ ఎలా..?
ఐపీఎల్ కోసం యూఏఈ బోర్డు.. బీసీసీఐతో అగ్రిమెంట్ చేసుకున్నా వ్యాక్సినేషన్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు రావొచ్చు. ప్రస్తుతం ఇండియాపై యూఏఈ ట్రావెల్ బ్యాన్ విధించింది. కొన్ని రూల్స్ సడలించినా.. వ్యాక్సినేషన్ మాత్రం తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. అలా చేస్తే ప్లేయర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్, మ్యాచ్ అఫీషియల్స్, కోచింగ్ స్టాఫ్, ఫ్రాంచైజీ అఫీషియల్స్, బీసీసీఐ అఫీషియల్స్.. ఇలా దాదాపు 700 నుంచి 800 మంది దాకా వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. టీమిండియా మెంబర్స్కు ఇప్పటికే ఒక డోస్ వ్యాక్సినేషన్ పూర్తయినా.. డొమెస్టిక్ క్రికెటర్లకు ఇంకా మొదలే కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెప్టెంబర్లోపు రెండో డోసుల వ్యాక్సిన్ వేసుకోవడం కష్టంగా మారింది. ‘యూఏఈ వచ్చే వారు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నది అక్కడి గవర్నమెంట్ రూల్. అబుదాబిలోనూ ఇదే పరిస్థితి. మ్యాచ్ల సందర్భంగా లాస్ట్ ఇయర్ పరిస్థితే ఉంటుంది. కచ్చితంగా క్వారంటైన్ రూల్స్, కొవిడ్ టెస్ట్లు ఇలా అన్నీ ఫాలో కావాల్సిందే’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.