న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే బీసీసీఐ జాక్పాట్ కొట్టింది. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఐపీఎల్.. ఇండియన్ బోర్డుపై మరోసారి కాసుల వర్షం కురిపించింది. గత మూడు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న మెగా లీగ్ మీడియా రైట్స్ (2023–27).. రూ. 48 వేల 390 కోట్లకు అమ్ముడుపోయాయి. ఫలితంగా క్రీడా చరిత్రలో అతిపెద్ద ప్రసార ఒప్పందాల్లో ఒకటిగా ఇది నిలిచింది. అలాగే ఒక మ్యాచ్ విలువతో పోలిస్తే.. ఇది రెండో విలువైన స్పోర్ట్గా రికార్డులకెక్కింది. రెండు రోజుల నుంచి ఉత్కంఠగా సాగిన వేలంలో ఈసారి రిలయన్స్ వయకామ్18 దూకుడును చూపెట్టింది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో కొనసాగుతున్న డిస్నీ స్టార్ గుత్తాధిపత్యానికి ఈసారి వయకామ్ చెక్ పెట్టింది.
టీవీ రైట్స్ ప్యాకేజ్ రూ. 23 వేల 575 కోట్లకు..
టీవీ రైట్స్ ప్యాకేజ్ను స్టార్ రూ. 23 వేల 575 కోట్లకు దక్కించుకోగా, డిజిటల్ రైట్స్ (ప్యాకేజ్–బి), నాన్ ఎక్స్క్ల్యూజివ్ (98 మ్యాచ్లు) ప్యాకేజ్–సి విషయంలో మాత్రం వయకామ్ పైచేయి సాధించింది. డిజిటల్ రైట్స్ను రూ. 20 వేల 500 కోట్లకు సాధించిన వయకామ్.. ప్యాకేజ్–సి కోసం రూ. 2991 కోట్లు వెచ్చించింది. ఓవరాల్గా ప్యాకేజ్–ఎ, బిలో కలిపి మొత్తం 410 మ్యాచ్లు (2023–24లో 74, 2025–26లో 84, 2027లో 94) ఉంటాయి. ప్యాకేజ్–డి (విదేశాల్లో టీవీ, డిజిటల్) రైట్స్ బేస్ప్రైస్ రూ. 3 కోట్లు కాగా.. వయకామ్, టైమ్స్ రూ. 1324కోట్లకు దక్కించుకున్నాయి. ఈ బిడ్ కోసం వయకామ్.. స్టార్ ఇండియా మాజీ హెడ్ ఉదయ్ శంకర్ (బోధి ట్రీ), జేమ్స్ మర్డోక్ (లూపా సిస్టమ్స్)తో కలిసి ఓ కన్సార్టియంను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యింది.
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ రూ.114 కోట్లు..
ఇందులో వయకామ్... ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, యూకే హక్కులను దక్కించుకోగా, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, యూఎస్ సెక్టార్.. టైమ్స్ చేతికి వెళ్లాయి. ఓవరాల్గా ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ 54.5 కోట్ల నుంచి రూ.114 కోట్లకు పెరిగింది. ఫలితంగా నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) తర్వాత రెండో ప్లేస్లో నిలిచింది. ఎన్ఎఫ్ఎల్ ఒక్క మ్యాచ్ విలువ 17 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 2008లో 10 శాతంగా ఉన్న డిజిటల్ స్పేస్ 90 శాతానికి పెరిగింది. 2018 స్టార్ రైట్స్ను గెలిచినప్పుడు డిజిటల్ నిష్పత్తి 75:25గా ఉంది. క్రికెట్ అభివృద్ధికి ఐపీఎల్ పర్యాయపదంగా మారిందని, మీడియా రైట్స్ విలువ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని బోర్డు కార్యదర్శి జై షా వ్యాఖ్యానించాడు.