అబుదాబి/దుబాయ్: హోరాహోరీగా సాగిన ఇండియా–ఇంగ్లండ్ టెస్టు సిరీస్ అనూహ్యంగా, అర్ధంతరంగా ముగియగా.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఐపీఎల్ 14వ సీజన్ ఫేజ్2కు షిఫ్ట్ అయింది. ఇండియా టీమ్ సపోర్ట్ స్టాఫ్ కరోనా బారిన పడటంతో ఐదో టెస్టు ఆగిపోగా.. అనుకున్నదానికంటే ముందుగానే టీమిండియా ప్లేయర్లు అరబ్ గడ్డపై అడుగు పెట్టారు. ఇంగ్లండ్ టూర్కు వెళ్లని ప్లేయర్లు, మాజీలు, యంగ్స్టర్స్ ఇప్పటికే దుబాయ్, అబుదాబీలోని తమ బేస్లో ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు టీమిండియా స్టార్స్తో పాటు పలువురు ఫారినర్స్ కూడా యూఏఈ చేరుకోవడంతో ఐపీఎల్ సందడి పెరిగింది. గ్రౌండ్ ప్రాక్టీస్లో కొందరు, నెట్స్లో మరికొందరు, క్వారంటైన్లో ఉన్నప్పటికీ హోటల్లోని జిమ్స్లో ఇంకొందరు చెమటలు చిందిస్తూ.. మెగా లీగ్ కోసం రెడీ అవుతున్నారు. అదే టైమ్లో టీమ్ బాండింగ్పై కూడా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ప్రాక్టీస్ తర్వాత టీమ్మేట్స్ అంతా ఆట, పాటలతో సేదతీరుతున్నారు. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరుతో సెకండ్ ఫేజ్ షురూ అవనుంది.
రోహిత్ ట్రెయినింగ్ షురూ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ క్వారంటైన్ టైమ్ను కూడా వేస్ట్ చేయడం లేదు. హోటల్లోనే ట్రెయినింగ్ స్టార్ట్ చేశాడు. ఇంగ్లండ్ నుంచి ఫ్యామిలీతో కలిసి అబుదాబి చేరుకొని ఆరు రోజుల మాండేటరీ క్వారంటైన్లో ఉన్న హిట్మ్యాన్ మంగళవారం ట్రెయినింగ్ మొదలు పెట్టాడు. టీమ్ హోటల్ ప్రాంగణంలో జాగింగ్, రన్నింగ్తో పాటు సైక్లింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ముంబై ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక, క్వారంటైన్ టైమ్ను భార్య సంజనతో బుమ్రా ఎంజాయ్ చేస్తున్నాడు. హోటల్ రూమ్ బాల్కనీలో ఈ జంట హ్యాపీగా ఉన్న ఫొటోను ముంబై షేర్ చేసింది. ఇక, తన బర్త్డేను సూర్యకుమార్ హోటల్ రూమ్లో ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. భార్యతో కలిసి కేక్ కట్ చేసిన తను.. బాల్కనీలోకి వచ్చి ఇతర రూమ్స్లో ఉన్న టీమ్మేట్స్కు చూపించాడు.
వాళ్లకు రెండ్రోజులే క్వారంటైన్
సెకండ్ ఫేజ్కు ముందు కంగారు పడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఊరట లభించింది. శ్రీలంక–సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఆడుతున్న వివిధ ఫ్రాంచైజీల ప్లేయర్లు యూఏఈ చేరుకున్న తర్వాత ఆరు రోజుల క్వారంటైన్ రూల్ పాటించాల్సిన అవసరం లేదని బీసీసీఐ తెలిపింది. సదరు ప్లేయర్లను ఫ్రాంచైజీలు.. ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలో వాళ్లు రెండు రోజుల క్వారంటైన్లో ఉంటే సరిపోతుందని బోర్డు చెప్పింది. దాంతో, ఈ ప్లేయర్ల లీగ్ స్టార్టింగ్ నుంచే జట్లకు అందుబాటులో ఉంటారు.
బ్లూ జెర్సీలో ఆర్సీబీ తొలి పోరు
ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కోసం రెడీ అవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. తమ ఆల్టర్నేట్ జెర్సీని రివీల్ చేసింది. మామూలుగా రెడ్ కలర్ జెర్సీ ధరించే ఆర్సీబీ.. ‘గో గ్రీన్’ ఇనీషియేటివ్లో భాగంగా ప్రతి సీజన్లో ఒక మ్యాచ్కు మాత్రం గ్రీన్ జెర్సీని ధరిస్తుంది. కానీ ఇప్పుడు దాని ప్లేస్లో బ్లూ జెర్సీ వచ్చేసింది. ఈ నెల 20న కోల్కతా నైట్రైడర్స్తో జరిగే తమ తొలి మ్యాచ్లో కోహ్లీసేన ఈ కొత్త జెర్సీని ధరించి మ్యాచ్ ఆడనుంది. కరోనా టైమ్లో గొప్పగా పని చేసిన ఫ్రంట్లైన్ వర్కర్స్కు గౌరవంగా, మద్దతుగా ఈ జెర్సీతో కనిపించనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సూచన మేరకు ఫ్రాంచైజీ... పీపీఈ కిట్ కలర్ను పోలిన విధంగా ఈ బ్లూ లైట్ కిట్ను రూపొందించింది.
సింగర్లుగా మారిన కుంబ్లే, జాఫర్
సెకండ్ ఫేజ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న టీమ్లు.. ప్రిపరేషన్స్తో పాటు ఎంటర్టైనమెంట్పై కూడా దృష్టిపెట్టాయి. ప్లేయర్ల ఆట విడుపు కోసం చిన్నచిన్న ప్రోగ్రామ్స్తో అలరిస్తున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్.. తమ హోటల్లో ఫెస్టివల్ మూడ్ను క్రియేట్ చేసింది. ఆట పాటలతో అలరిస్తూ క్రికెటర్లందరూ సేద తీరారు. అయితే ఎప్పుడూ ఆటపైనే దృష్టిపెట్టే పంజాబ్ కోచ్, స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే, ఆ టీమ్ బ్యాటింగ్ కోచ్ వసీమ్ జాఫర్.. తమలోని కొత్త టాలెంట్ను బయటకు తీశారు. ఈ ఇద్దరు కలిసి కిశోర్ కుమార్ ఫేమస్ సాంగ్ ‘కబీ అల్విదా నా కెహనా’ పాటకు గొంతు కలిపారు. వాళ్ల సింగింగ్ టాలెంట్ చూసి ప్లేయర్లు ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.