ముంబై: ఐపీఎల్ పుణ్యమా అని బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే రెండు కొత్త జట్లు, ప్రసార హక్కులతో కోట్లలో ఆర్జిస్తున్న బోర్డు.. ఐపీఎల్ స్పాన్సర్ల నుంచి కూడా భారీ ఆదాయం పొందుతోంది. ఈ సీజన్కు గాను స్పాన్సర్షిప్స్ ద్వారా దాదాపు రూ.1000 కోట్ల ఆదాయంతో ఐపీఎల్ రికార్డు సృష్టించింది.15 సీజన్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్ నుంచి వివో తప్పుకోగా.. ఆ ప్లేస్ లో వచ్చిన టాటా గ్రూప్ ఏడాదికి రూ.355 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఆపై స్విగ్గీ ఇన్ స్టామార్ట్ (44 కోట్లు), రూపే (42 కోట్లు) లను అధికారిక పార్ట్నర్స్ గా తీసుకుంది. దీంతో అధికారిక స్పాన్సర్స్ సంఖ్య ఆరుకు చేరింది. డ్రీమ్ ఎలెవన్ (48 కోట్లు), అన్ అకాడమీ (46 కోట్లు), క్రెడ్ (44 కోట్లు), అప్ స్టాక్స్ (42 కోట్లు)తో పాటు స్విగ్గీ, రూపే అధికారిక పార్ట్నర్స్ గా ఉండనున్నాయి. ఇక అఫీషియల్ అంపైర్ పార్ట్నర్గా పేటీఎమ్ (28 కోట్లు), టైమ్ ఔట్ పార్ట్నర్ గా సియట్ (28 కోట్లు) వ్యవహరించనున్నాయి. కాగా ఎగ్జిట్ ఫీజులు, టైటిల్ స్పాన్సర్ బదలాయింపుతో వివో నుంచి బోర్డుకు రూ.200 కోట్లు అదనంగా సమకూరనున్నాయి.
ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్కూ స్పాన్సర్లు
సీజన్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ లకు కూడా ఈసారి స్పాన్సర్స్ను ఆహ్వానించారు. సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ కంపెనీ అరామ్ కో ఏడాదికి రూ.65 కోట్లతో వీటి హక్కులు దక్కించుకుంది. దీంతో ఇకపై అరామ్ కో ఆరెంజ్ క్యాప్, అరామ్ కో పర్పుల్ క్యాప్ గా వీటిని పిలవనున్నారు.