- వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడమే కారణం
- ఓవర్సబ్స్క్రిప్షన్, ఐపీఓ ధరలను మాత్రమే పట్టించుకుంటున్న మెజార్టీ ఇన్వెస్టర్లు
- ఎస్ఎంఈ ఐపీఓల్లో ఇష్యూ ప్రైస్ నుంచి 72 శాతం వరకు పతనమైన షేర్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ మార్కెట్ కళకళలాడింది. ప్రతీ వారం కనీసం ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. మెయిన్ బోర్డ్తో సహా ఎస్ఎంఈ ఐపీలు ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. కానీ, మార్కెట్లో లాభాల్లో లిస్టింగ్ అయిన చాలా కంపెనీల షేర్లు ప్రస్తుతం ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి. ఎస్ఎంఈ ఐపీఓలు 72 శాతం వరకు పడగా, మెయిన్ బోర్డ్ ఐపీఓలు 37 శాతం వరకు క్రాష్ అయ్యాయి. బీఎస్ఈ డేటా ప్రకారం, 73 మెయిన్ బోర్డ్ ఐపీఓలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లు సేకరించాయి. ఇందులో 23 ఐపీఓలు అంటే మూడో వంతు ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి. వీటిలో ఎక్కువ సబ్స్క్రిప్షన్ సాధించిన కంపెనీలు కూడా ఉన్నాయి. క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓ 51 రెట్లు, ఈప్యాక్ డ్యూరబుల్స్ 17 రెట్లు, ముత్తూట్ మైక్రోఫిన్ 13 రెట్లు, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ నాలుగు రెట్లు, జీపీటీ హెల్త్కేర్ ఎనిమిది రెట్లు సబ్స్క్రిప్షన్ సాధించాయి. మరోవైపు 177 కంపెనీలు ఎస్ఎంఈ ఐపీఓ ద్వారా రూ. 5,100 కోట్లు సేకరించాయి. ఇందులో 57 కంపెనీల షేర్లు ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి. ఈ కంపెనీల ఐపీఓలు రెండు నుంచి 18 రెట్ల వరకు సబ్స్క్రిప్షన్ సాధించాయి.
రీసెర్చ్ చేయడం లేదు..
చాలా ఐపీఓలు మార్కెట్లో ప్రీమియం (ఎక్కువ ధర) తో లిస్ట్ అయ్యాయని ఎనలిస్టుల చెబుతున్నారు. దీంతో ఓవరాల్ మార్కెట్ బుల్లిష్గా ఉన్నా, ఈ షేర్లు మరింత పెరగడానికి అవకాశం పెద్దగా లేదని అన్నారు. ఐపీఓలకు వచ్చిన కంపెనీల వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని, వీటి రెవెన్యూ, లాభాలు చూస్తే మాత్రం షేర్లు మరింత పెరిగే ఛాన్స్ కనబడడం లేదని వివరించారు. దీంతో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో లిస్ట్ అయిన మెయిన్ బోర్డ్ ఐపీఓల్లో క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ (ఇష్యూ ధర కంటే 37 శాతం డౌన్) , ఈప్యాక్ డ్యూరబుల్స్ (32 శాతం డౌన్) , ముత్తూట్ మైక్రోఫిన్ (31 శాతం డౌన్) షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఎస్ఎంఈ ఐపీఓల్లో బిజోటిక్ కమర్షియల్ ఇష్యూ ధర నుంచి 72 శాతం పడింది. పాట్రాన్ ఎగ్జిమ్ షేర్లు 71 శాతం, సెల్ పాయింట్ ఇండియా 61 శాతం పడ్డాయి. సాధారణంగా ఐపీఓల ట్రెండ్ కొనసాగినప్పుడు ఇన్వెస్టర్లు ఓవర్సబ్స్క్రిప్షన్, లిస్టింగ్ ప్రైస్ను పట్టించుకున్నంతగా వాల్యుయేషన్ను పట్టించుకోవడం లేదని ఇండిపెండెంట్ మార్కెట్ ఎనలిస్ట్ అంబరీస్ బలిగా అన్నారు. సరిగ్గా రీసెర్చ్ చేయకుండా ఐపీఓలకు అప్లయ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కావాలని ఐపీఓలు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యేటట్టు చేసే వాళ్లు ఉంటారని, ఇ న్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కావాలని తప్పుడు ఐపీఓ అప్లికేషన్లను సబ్మిట్ చేసి, ఎక్కువ సబ్స్క్రిప్షన్ జరిగేటట్టు చేస్తున్న అకౌంట్లపై సెబీ దర్యాప్తు చేస్తోంది. అంతేకాకుండా ఎస్ఎంఈ సెగ్మెంట్లో ప్రైస్ మానిప్యులేషన్ జరుగుతున్నట్టు సంకేతాలు అందాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ పేర్కొన్నారు కూడా.