
- ప్రైస్ బ్యాండ్ రూ. 250–265
ముంబై: హైఎండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోని సైయంట్ డీఎల్ఎం ఐపీఓ ఈ నెల 27 న మొదలవనుంది. ఒక్కో షేరుకు రూ. 250 – రూ. 265 ప్రైస్ బ్యాండ్గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ. 700 కోట్లను కంపెనీ సమీకరించాలనుకుంటోంది. ఐపీఓ తర్వాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 70 శాతానికి తగ్గనుంది. హనీవెల్, థేల్స్, ఏబీబీ, బీఈఎల్, మోల్బియో వంటి పెద్ద కంపెనీలు సైయంట్ డీఎల్ఎం కస్టమర్లు. మార్చి 2023 నాటికి తమ ఆర్డర్ బుక్ సైజు రూ. 2,450 కోట్లకు చేరినట్లు చైర్మన్ గణేష్ వెంకట కృష్ణ బోదనపు చెప్పారు.
రాబోయే రెండేళ్లలో ఈ ఆర్డర్లను నెరవేర్చ వలసి ఉంటుందని పేర్కొన్నారు. ఏడాది కాలానికి చూస్తే ఆర్డర్ బుక్ డబులైందని అన్నారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రాన్స్మిటర్లు, రిసీవర్లు వంటి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులను సైయంట్ డీఎల్ఎం తయారు చేస్తోంది. రెవెన్యూలో 40 శాతం డొమెస్టిక్ సేల్స్ నుంచి వస్తోందని, మైసూర్ యూనిట్ ప్రధానంగా దేశీయ కస్టమర్ల కోసం పనిచేస్తోందని మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర వెలగపూడి వెల్లడించారు. హైదరాబాద్లోని యూనిట్ల నుంచి ఎగుమతులు సాగిస్తున్నామని చెప్పారు. ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుతో రూ. 450 కోట్ల అప్పులను తీర్చి వేస్తామని, మిగిలిన దానిని వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వాడుకుంటామని తెలిపారు. మార్చి 2023 తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో కంపెనీ రూ. 832 కోట్ల రెవెన్యూ పై, రూ. 129 కోట్ల నికరలాభం సంపాదించింది.