టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు ప్రతీదాడులతో మిడిల్ ఈస్ట్ మళ్లీ మండిపోతుంది. ఈ తరుణంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్పై దాడులు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, తమ మిత్రపక్షమైన లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే మాత్రం తీవ్రమైన దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లిన పశ్చిమాసియాలో ఇరాన్ లేటేస్ట్ ప్రకటనతో శాంతి వాతావరణం ఏర్పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ వార్కు బ్రేక్ పడటంతో ప్రపంచదేశాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.
అసలేం జరిగిందంటే..!
గత కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మళ్లీ భగ్గుమంటోంది. లెబనాన్లోని బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్లోని రామత్ డేవిడ్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.
►ALSO READ | తక్షణమే కాల్పులు ఆపండి: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు ట్రంప్ పిలుపు
ఇరాన్ మిస్సైళ్లను గాల్లోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇరాన్ దాడులకు కౌంటర్గా నైరుతి ఇరాన్లోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపింది. ఇరు దేశాల పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ మళ్లీ మండిపోతుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ చేరుకుంటుండటంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రంగంలోకి దిగారు.
తక్షణమే కాల్పులు ఆపండి: ట్రంప్
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో విరుచుకుపడుతుండటంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలకు కీలక పిలుపునిచ్చారు. తక్షణమే కాల్పులు ఆపాలని ఇరు దేశాలకు సూచించారు. ట్రంప్ పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్పై సైనిక చర్య నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం గమనార్హం
