ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర యుద్ధం.. ఇద్దరు కమాండర్లతో పాటు కీలక అధికారులు హతం..

ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర యుద్ధం.. ఇద్దరు కమాండర్లతో పాటు కీలక అధికారులు హతం..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతోంది.  ఇరాన్ వ్యాప్తంగా ఎటు చూసినా బాంబుల మోత.. ప్రజల ఆర్థనాధాలతో ధ్వనిస్తోంది. శుక్రవారం (జూన్ 13) తెల్లవారుఝాము నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాదులకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యూక్లియర్ కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన ఇద్దరు కమాండర్లతో పాటు ఇద్దరు న్యూక్లియర్ కేంద్ర అధికారులు కూడా మృతి చెందడం సంచలనంగా మారింది. 

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ‘ రివొల్యుషనరీ గ్వార్డ్ ఛీఫ్ కమాండర్’ హొసైన్ సలామీ మృతి చెందినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. టెహ్రాన్ లో జరిగిన ఎయిర్ స్ట్రైక్ లో ఆయన చనిపోయినట్లు ప్రకటించింది. అదేవిధంగా IRGC సీనియర్ కమాండర్ ఘొలామలీ రషీద్ తో పాటు ఫెరీదౌన్ అబ్బాసీ, మహమ్మద్ మెహ్దీ టెహ్రాంచీ అనే ఇద్దరు న్యూక్లియర్ కేంద్ర అధికారులు మృతి చెందినట్లు పేర్కొంది. 

టెహ్రాన్ లోని ఆరు మిలిటరీ బేస్ లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ భారీ ఎత్తున ఎయర్ స్ట్రైక్ లకు దిగింది. దీంతో ఇద్దరు కీలక కమాండర్లతో పాటు అధికారులు మృతి చెందడం ఇరాన్ కు తీవ్ర నష్టంగా పరిగణిస్తున్నారు. 

టెహ్రాన్ లో మిలిటరీ కమాండర్స్ ఉండే కాంప్లెక్స్ లు, నివాస స్థలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లు సీనియర్ ఇరాన్ అధికారులు తెలిపారు. కీలక కమాండర్లు, నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. సాధారణ ప్రజలు, నాయకుల ను టార్గెట్ చేయలేదని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. 

ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ ఇప్పట్లో ఆగదు: నెతన్యాహు

అయితే ఇజ్రాయెల్ దాడులను అధికారికంగా ప్రకటించారు ప్రధాని నెతన్యాహు. ‘రైజింగ్ లయన్’ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కోసమే ఇరాన్ పై దాడులకు దిగుతున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ చాలా రోజులు జరగనుందని తెలిపారు. ఇజ్రాయెల్ కు ఉన్న  అపాయం తొలగిపోయేదాక ఈ ఆపరేషన్ ఆపబోమని ప్రకటించారు.