యాదాద్రి జిల్లాలో ఆగని అక్రమ అబార్షన్లు.. 13 వారాల గర్భాన్ని తొలగించిన ‘డాక్టర్లు’ !

యాదాద్రి జిల్లాలో ఆగని అక్రమ అబార్షన్లు..  13 వారాల గర్భాన్ని తొలగించిన ‘డాక్టర్లు’ !
  • 13 వారాల గర్భాన్ని తొలగించిన ‘డాక్టర్లు’
  • విచారణ ప్రారంభించని డాక్టర్ల టీమ్​​ 

యాదాద్రి, వెలుగు: అర్హతలు లేకున్నా స్థాయికి మించి వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లను అరికట్టేందుకు .. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలను నిలువరించేందుకు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా యాదాద్రి జిల్లాల్లో వారి ఆగడాలు ఆగడంలేదు. జిల్లాలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

 ఇటీవల యాదాద్రిలోని ఒక ఆస్పత్రిలో మహిళకు అక్రమంగా అబార్షన్​ చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు హెల్త్​ డిపార్ట్​మెంట్​ముగ్గురు డాక్టర్లతో ఒక టీమ్​ను ఏర్పాటు చేసింది. అయితే ఇంకా టీమ్​ విచారణ ప్రారంభించలేదు. 

యాదాద్రి జిల్లాలో ఇటీవల వరుసగా అబార్షన్ల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జూలై లో మూడు అబార్షన్ల కేసులు బయటకు వచ్చాయి. ఈ కేసుల్లో బాలింత, ఓ శిశువు చనిపోయిన విషయం తెల్సిందే. ఏ అర్హతలు లేకపోయినా ఇద్దరికి అబార్షన్లు చేసిన వ్యక్తిమీద కేసు నమోదు చేశారు. అబార్షన్​ చేయించుకున్న మరో మహిళ .. తనకు అబార్షన్​ చేసిన నకిలీ డాక్టర్​తో రాజీ పడడంతో కేసు పక్కదారి పట్టింది. 

వరుస అబార్షన్ల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్​ హాస్పిటల్స్​పై అధికారులు దాడులు చేస్తున్నారు. అస్పత్రుల పర్మిషన్లు, వాటి పనితీరు, క్వాలిఫైడ్​ డాక్టర్లు ఉన్నారా..? లేరా..? తదితర అంశాలను తనిఖీ చేస్తున్నారు. ​ జిల్లాలో ఉన్న 288 హాస్పిటల్స్​, 57 డయాగ్నిస్టిక్​ సెంటర్లను వైద్యారోగ్య శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. 

 ఆడపిల్ల​ అని తేలడంతో.. ​

ప్రైవేట్​ హాస్పిటల్స్​ తనిఖీలు ఇంకా కొనసాగుతుండగానే ఈ నెల 18న మరో అబార్షన్​ జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. తుర్కపల్లి మండలానికి చెందిన వివాహిత భువనగిరిలోని ఓ డయాగ్నిస్టిక్​ సెంటర్​లో స్కానింగ్​ చేయించుకోగా ఆడపిల్ల అని తెల్సింది. దాంతో ఆమెకు ఒక ప్రైవేట్​ హాస్పిటల్​కు వెళ్లిందని, 13 వారాల గర్బాన్ని తొలగించుకుందని తెలిసింది. భువనగిరి పోలీసులు సదరు హాస్పిటల్​కు వెళ్లి వివరాలు సేకరించారు. 

ఆ సమాచారాన్ని రెండ్రోజుల తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు అందించారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ముగ్గురు డాక్టర్లతో టీమ్​ను ఏర్పాటు చేశారు. సదరు డాక్టర్లు డ్యూటీలో బిజీగా ఉండడంతో ఇంకా విచారణ ప్రారంభించలేదని, వినాయక చవితి తర్వాత విచారణ బృందం హాస్పిటల్​ను తనిఖీ చేయనుందని అధికారులు చెప్తున్నారు. అబార్షన్​ చేయించుకున్న మహిళను కూడా విచారిస్తారు. ఆస్పత్రికి అనుమతులు ఉన్నాయా, మెడికల్​ టెర్మినేషన్​ ఆఫ్​ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) అనుమతులు ఉన్నాయా అని పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్​ చేసినట్టు తేలితే సదరు హాస్పిటల్​పై చర్యలు తీసుకుంటారు.