గొల్లపల్లి, వెలుగు : ఏడాదిలోపు ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మండలకేంద్రంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ప్రాజెక్ట్లను పూర్తిచేయకపోవడంతో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తిచేసేందుకు రూ.1,000 కోట్లు అవసరమన్నారు. నియోజకవర్గంలోని పత్తిపాక రిజర్వాయర్, అక్కపల్లి లిఫ్ట్, మేడారం రిజర్వాయర్ నుంచి కొత్తపల్లి వరకు కాలువ పనులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
చిల్వకోడూరు గ్రామంలో రూ. 7.65 లక్షలతో పెద్దచెరువు తూము రిపేర్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న, ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తిరుపతి గౌడ్, సర్పంచ్ నీరజ, ఉపసర్పంచ్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
